
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేస్తామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. ఇల్లంతకుంట తహసీల్దార్ ఆఫీస్ నుంచి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మొత్తం 241 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని తెలిపారు. జిల్లాలో 36 బాయిల్డ్ రైస్మిల్లులు ఉండగా, ఒక్కరు మాత్రమే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారని, మిగతావారు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రైస్మిల్లర్లు ముందుకు రాకపోతే ప్రత్యామ్నాయంగా గోదాములలో రైతుల నుంచి సేకరించిన ధాన్యం నిల్వ చేస్తామన్నారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అమరేందర్రెడ్డి, మిషన్ భగీరథ అధికారులు జానకి, శ్రీనివాస్, డీఎస్వో పి.వసంతలక్ష్మి, పౌరసరఫరాల డీఎం రజిత, అధికారులు కిశోర్, ఇల్లంతకుంటలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
భూసమస్యల పరిష్కారానికి రెండంచెల వ్యవస్థ
ఇల్లంతకుంట(మానకొండూర్): భూభారతిలో భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. ఇల్లంతకుంట రైతువేదికలో శనివారం భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే ఉంటుందని తెలిపారు. కొత్తచట్టంలో పెండింగ్ సాదా బైనామాలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. భూమిహక్కులు ఎలా సంక్రమించినా మ్యుటేషన్ చేసి రికార్డుల్లో నమోదు చేస్తారని తెలిపారు. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వ పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ధరణిలో ఇక్కట్లు పడ్డ రైతులకు భూభారతితో పరిష్కారం లభిస్తుందని తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ ఎంఏ ఫరూక్, ఎంపీడీవో శశికళ, వ్యవసాయాధికారి సురేశ్రెడ్డి పాల్గొన్నారు.