● 975 మార్కులతో ప్రతిభ చాటిన కత్తికిరణ్
సింగరాయకొండ: తల్లిదండ్రులు కూలి పనులు..పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లారు. నాయనమ్మ దగ్గర ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ అత్యుత్తమ మార్కులు సాధించాడో పేదింటి విద్యార్థి. ప్రభుత్వం బుధవారం విడుదలచేసిన ఇంటర్ ఫలితాల్లో 975 మార్కులు సాధించి సత్తాచాటాడు. సింగరాయకొండ ఏఆర్సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజిలో కత్తి కిరణ్ సీనియర్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. తండ్రి శ్రీను, తల్లి శ్రీలక్ష్మి హైదరాబాద్లో కూలి పనిచేస్తున్నారు. నాయనమ్మ సుబ్బులమ్మ వద్ద సోదరి పల్లవితో కలిసి పాతసింగరాయకొండ పంచాయతీ నరసింహానగర్ కాలనీలో ఉంటున్నాడు. ప్రతిరోజు అన్న చెల్లెలు కలిసి వంట చేసుకుని కాలేజీకి నడిచి వెవెళ్లేవారు. కిరణ్కు నూరు శాతం హాజరు తోపాటు చదువు తప్ప ఇతర వ్యాపకాలు లేవని కాలేజి ప్రిన్సిపాల్ ఎం సౌజన్య తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 460 మార్కులు రాగా, పదో తరగతిలో 540 మార్కులు సాధించాడు.


