● మంత్రిగా ఉండి నువ్వేం చేశావ్..
● మంత్రి స్వామిపై ఆదిమూలపు సురేష్ ధ్వజం
సింగరాయకొండ: జగనన్న పర్యటనతో మత్స్యకారులకు ధైర్యం వచ్చిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మత్స్యకారులకు భరోసా కల్పించడంలో బాబు ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. మత్స్యకారులు ప్రాణాలు తెగించి తమిళనాడు సోనాబోట్లను పట్టుకుంటే ప్రభుత్వంలో పెద్దలు కుట్రపన్ని వాటిని విడిపిపెట్టారని మండిపడ్డారు. పాకల గ్రామంలో 164 గ్రామాలకు చెందిన వేలాది మంది మత్స్యకారులు సమావేశం నిర్వహిస్తే మంత్రి స్వామి వారిని కనీసం పలకరించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జువ్వలదిన్నె జగనన్న పర్యటనకు వేలాది మంది మత్స్యకారులు స్వచ్ఛందంగా తరలివెళ్లారని, దాన్ని చూసి ఓర్వలేకే మంత్రి స్వామి అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. మారిటైం బోర్డు చైర్మన్ అంటూ మరో వ్యక్తి దందాలు, స్కాంలు చేసుకుంటూ ముందు ఒక కారు, వెనక ఒక కారు ఎస్కార్ట్ పెట్టుకుని అధికారం అనుభవిస్తూ కనీసం మత్స్యకారుల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మీరిద్దరూ మత్స్యకారుల గురించి పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తుంటే దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి జగనన్న పర్యటనతో ఊపిరి వచ్చిందన్నారు. అధికారంలో ఉన్నామని ఇలానే వ్యవహరిస్తే రానున్న రోజుల్లో మత్స్యకార గ్రామాల్లో తిరిగేందుకు కూడా అవకాశం ఉండదన్నారు. జగనన్న పర్యటనతో మత్స్యకారులకు పూర్తి భరోసా లభించిందని పేర్కొన్నారు. జువ్వలదిన్నె హార్బర్తో పాటు తాను రాష్ట్రంలో తలపెట్టిన పది హార్బర్లకు మత్స్యకారులే హక్కుదారులని ప్రకటించారన్నారు. కూటమి ప్రభుత్వం జువ్వలదిన్నె హార్బర్లో ప్రైవేట్ ఢిఫెన్స్ అకాడమీకి స్థలం కేటాయిస్తే తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కంపెనీని సాగనంపుతానని చెప్పారని, మత్స్యకారులకు ఇంతకంటే ఇంకేం భరోసా కావాలని సురేష్ మంత్రి స్వామిని ప్రశ్నించారు. మత్స్యకారులకు 2024–25 మధ్య పెండింగ్ బకాయిలు చెల్లించాలని, సముద్ర మత్స్యకార నియంత్రణ చట్టం 1994 సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జువ్వలదిన్నె హార్బర్లో మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తెచ్చిన తమిళ రాష్ట్రాల సోనాబోట్లను తరలించటంలో ప్రధానపాత్ర పోషించిన రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్రావు, ఐటీ మంత్రి నారాలోకేష్, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


