యర్రగొండపాలెం: చిన్నారుల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల ముందు మృతదేహాలతో రాస్తారోకో చేశారు. మండలంలోని చిన్నబోయలపల్లె ఎస్సీ కాలనీకి చెందిన కొమ్ము శశికుమార్, బోయలపల్లి దీపన్లు నీటి కుంటలోపడి మృతి చెందారు. ఈ సంఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు, ఆ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. అక్రమంగా కాలనీకి సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసుకున్న నీటి కుంటను పూడ్చివేయాలని, చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని వారు కోరారు. దాదాపు 3 గంటలపాటు జరిగిన రాస్తారోకో వలన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని, ఆందోళనను విరమించాలని సీఐ అజయ్ కుమార్ వారితో చర్చించారు. పరిస్థితి అదుపులో రాకపోవడంతో ట్రాఫిక్ను డైవర్షన్ చేసి వాహనాలను అటుగా వెళ్లేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అనంతరం సీఐ ఆందోళన చేస్తున్న వారితో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింపచేశారు.


