● కలెక్టర్ విజయసునీత
మార్కాపురం: అగ్నిప్రమాదాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయసునీత అన్నారు. స్థానిక అగ్నిమాపకశాఖ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విధి నిర్వహణలో అగ్నిప్రమాదాల్లో ప్రాణాలుకోల్పోయిన ఉద్యోగులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారోత్సవాల సందర్భంగా అపార్ట్మెంట్లు, స్కూళ్లు, కాలేజీలు, పెట్రోల్బంకులు, గ్యాస్ గోడౌన్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫైర్ ఆఫీసర్ ఆర్ రామకృష్ణ ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ప్రజలు వారి ప్రాణ, ఆస్తి నష్టం నుంచి ఎలా కాపాడుకోవాలో వివరించారు. అనంతరం అగ్నిమాపక కార్యాలయంలో మొక్కలను నాటారు.
ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం...మండలంలోని యరజర్ల గ్రామానికి చెందిన మల్లవరపు పేరయ్య (60) మధ్యాహ్నం 3 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై ఒంగోలు వస్తున్నాడు. వెంగముక్కలపాలెం సమీపంలోకి రాగానే వాహనాన్ని రోడ్డు పక్కన నిలబెట్టి ఆగాడు. అదే సమయంలో అక్కడ ఉన్న టిప్పర్ వాహనం రివర్స్ చేసుకుంటూ పేరయ్యపై నుంచి వెళ్లింది. దీంతో టిప్పర్ కింద పడి పేరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


