
సత్తా చాటిన బాపట్ల జిల్లా ఎడ్లు
రాచర్ల: మండలంలోని ఒద్దులవాగుపల్లె పంచాయతీ పరిధిలోని అచ్చంపల్లె గ్రామంలో సీతాలక్ష్మణ హనుమత్ సమేత పట్టాభిరామస్వామి నూతన విగ్రహ, ధ్వజ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి న్యూ కేటగిరీ ఎడ్ల బండలాగుడు పోటీల్లో బాపట్ల జిల్లా ఎడ్ల జతలు సత్తా చాటాయి. పోటీల్లో మొత్తం 7 జతల ఎడ్లు పాల్గొన్నాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన శివకృష్ణచౌదరి ఎడ్లు నిర్ణీత 20 నిమిషాల్లో 3767 అడుగులు లాగి మొదటి బహుమతి రూ.80 వేలు సాధించాయి. నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన బొరెడ్డి కేశవరెడ్డి ఎడ్ల జతలు రెండో బహుమతి, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడు గ్రామానికి చెందిన గరికపాటి లక్ష్మయ్య చౌదరి ఎడ్లు మూడో బహుమతి, కురిచేడు మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన ఎం.బయ్యపురెడ్డి ఎడ్లు నాలుగో బహుమతి, బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఉప్పుమాగుటూరు గ్రామానికి చెందిన తేజశ్రీరెడ్డి ఎడ్లు ఐదో బహుమతి, తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా కోదాడ గ్రామానికి చెందిన డాక్టర్ హుసేన్ ఎడ్లు ఆరో బహుమతి, నంద్యాల మండలం ఎన్.కొత్తపల్లి గ్రామానికి చెందిన చల్లా వెంకటహారిక ఎడ్లు ఏడో బహుమతి గెలుపొందాయి. ప్రథమ బహుమతిని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి కేపీ నాగార్జునరెడ్డి బహూకరించారు.