
పేదలకు నివేశన స్థలాలివ్వాలి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్
ఒంగోలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థలం మంజూరు చేయాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రానికి తహసీల్దార్కు అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్నా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. బడాబాబులు, కార్పొరేట్ సంస్థలకు సంపద దోచిపెట్టే విధంగా పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం, వితంతు, ఒంటరి మహిళ పెన్షన్లు, మహిళలకు ఉచిన బస్సు, మహిళకు నెలకు రూ.1500, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇచ్చే పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఒంగోలులోని అగ్రహారం దగ్గర ఇచ్చిన పట్టాలకు పొజిషన్ చూపాలని, ఒక సెంటు భూమిని రెండు సెంట్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్న 42వ డివిజన్ సరళాదేవినగర్, 16వ డివిజన్ దత్తాత్రేయ కాలనీ, కార్మిక నగర్ గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలన్నారు. సీపీఐ నాయకులు ఆర్.వెంకట్రావు, ఆర్.రామకృష్ణ, ఎం.విజయ, శ్రీరాం శ్రీనివాసరావు, ఎంఏ సలార్, నూనె మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.