
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
● కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించబోనని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే ఊరుకోబోనని అధికారులను హెచ్చరించారు. వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన శ్రీమీ కోసం్ఙ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ‘మీ కోసం’ కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నందున ప్రతి ఒక్క అర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వాటికి అర్ధవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని ఆమె ఆదేశించారు. అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్లైన్లో వచ్చిన వినతులను చూడాలని ఆమె చెప్పారు. సాంకేతిక సమస్యల వలన క్షేత్రస్థాయిలో పరిష్కరించలేని అర్జీలు వస్తే ఆ విషయాన్ని ప్రజలకు అప్పుడే స్పష్టం చేయాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్, కుమార్, జాన్సన్, డిప్యూటీ కలెక్టర్ పార్ధసారథి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.