
నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో నిరంకుశ, ప్రజావ్యతిరేక పాలన ఏడాదిగా కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఓట్లు వేయించుకునేందుకు ప్రజలను మభ్యపెట్టేలా ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ డిమాండ్ చేస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీనీ అమలు చేయలేదని విమర్శించారు. అమలు చేయమని అడుగుతున్న వారిపై అధికారాన్ని, అధికారులను అడ్డంపెట్టుకుని దాడులు, బెదింపులు, అరెస్టులు చేయిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ సుమారు 400 మంది హత్యకు గురయ్యారని, 800 మందిపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఇదంతా చూస్తుంటే ఇంత దుర్మార్గమైన పాలన ఎటువైపు వెళుతోందో ప్రజలు గమనించాలన్నారు. నమ్మించి ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక వంచిస్తోందని, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని, ఇందుకు నిరసనగా ఈ నెల 4వ తేదీ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజలతో కలసి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలసి వంచనకు పాల్పడుతున్న చంద్రబాబుపై పోరాటం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. 4వ తేదీ చేపట్టిన ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఏడాదిగా కూటమి నేతలు చేసిన మోసానికి ప్రజలు ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
తప్పుడు కేసులకు భయపడం:
తప్పుడు కేసులు పెడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రభుత్వం వేధిస్తోందని, దీనికి భయపడేది లేదన్నారు. ప్రజలు బయటకు వచ్చి ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకుని ప్రభుత్వం 30 యాక్టు, 144 సెక్షన్లు అంటూ నిబంధనలు పెడుతోందని చెవిరెడ్డి విమర్శించారు. ప్రజల పక్షాన పోరాటం చేసే సమయంలో పుట్టిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, ఎలాంటి బెదిరింపులకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బెదరని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని విలేకరుల సాక్షిగా చెప్పే ధైర్యం ఈ మంత్రులకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. రేషన్ వాహనాలు రద్దు చేయడంతో నేడు ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికొచ్చే బియ్యాన్ని ఈ రోజు ఎన్నో అవస్థలు పడి తెచ్చుకోవాల్సి వస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పెద్ద ఎత్తున జనం పోరాటాలకు ముందుకు వస్తున్నారన్నారు. ఒక సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందని చెవిరెడ్డి ధ్వజమెత్తారు. తొలుత ఈ నెల 4వ తేదీ నిర్వహించే వెన్నుపోటు దినం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటించిందన్నారు. చంద్రబాబు ఉన్న ఉద్యోగాలు పీకేయడంతో పాటు నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. 20 వేల మంది ఎకై ్సజ్ లో పనిచేస్తున్న సిబ్బందిని, 9 వేల మంది రేషన్ వాహనాల డ్రైవర్లు తొలగించి వెన్నుపోటు పొడిచారన్నారు. రైతులను, మహిళలను, అమ్మ ఒడి ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని, ఇలా అన్ని వర్గాల వారిని వెన్నుపోటు పొడిచారన్నారు. మా పార్టీ పిలుపు మేరకు జూన్ 4వ తేదీ అంబేడ్కర్ భవన్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ గా వెళ్లి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వేలాదిమంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు కనువిప్పు కలిగేలా ఈ వెన్నుపోటు దినంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు రూరల్ మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజీవ్, దేవా, శ్రీకాంత్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మహిళా నాయకులు సాధం విజయలక్ష్మి, అప్సర్బేగ్, తదితరులు పాల్గొన్నారు.
ఏడాదిలో 400 మంది హత్యకు గురయ్యారు 800 మందిపై దాడులు జరిగాయి ఎన్ని యాక్టులు పెట్టినా బెదిరేదిలేదు తప్పుడు కేసులకు భయపడం 4వ తేదీ నిరసనను విజయవంతం చేయండి వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి చెవిరెడ్డి ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబు
వెన్నుపోటు దినం వాల్పోస్టర్ను ఆవిష్కరిస్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చుండూరు రవిబాబు తదితరులు