
జలజీవన్ మిషన్ను సద్వినియోగం చేసుకోండి
● కేంద్ర ప్రత్యేకాధికారి వగీష్ తివారి
యర్రగొండపాలెం: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆ మిషన్ ప్రత్యేకాధికారి డాక్టర్ వగీష్ తివారి సూచించారు. యర్రగొండపాలెం మండలంలోని గురిజేపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన ఫారం పాండ్లు, గ్రామంలో ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తివారి మాట్లాడుతూ ఫారం పాండ్లతో రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. వీటి ద్వారా రైతులు పొలాల్లోనే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. భూగర్భ జలాలు కూడా పెరుగుతాయన్నారు. ఆయా ప్రాంతాల్లోని రైతులంతా పొలాల్లో ఫారం పాండ్లు ఏర్పాటు చేసుకునేలా సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం కింద ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిల నుంచి సక్రమంగా నీటి సరఫరా జరుగుతుందా..? అని ప్రజలనడిగి తెలుసుకున్నారు. తాగునీటిని వృథా చేయకుండా ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం సచివాలయంలో నీటిని పరీక్షించే మిషన్ల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని, మురారిపల్లెలో ఉన్న ఫారెస్ట్ నర్సరీలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జలజీవన్ మిషన్ నోడల్ అధికారి దినేష్కుమార్ పేరివాల్, డ్వామా పీడీ జోసఫ్కుమార్, మార్కాపురం క్లస్టర్ ఏపీడీ నిర్మలాదేవి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఐటీడీఏ ప్రత్యేకాధికారి కె.నాగేశ్వరరావు, ఏపీవో శైలజ, ఈసీ లక్ష్మానాయక్ పాల్గొన్నారు.