ఏషియన్‌ అడ్మిరబుల్‌ అచీవర్స్‌లో మధుసూదన్‌కు స్థానం | - | Sakshi
Sakshi News home page

ఏషియన్‌ అడ్మిరబుల్‌ అచీవర్స్‌లో మధుసూదన్‌కు స్థానం

May 29 2025 1:13 AM | Updated on May 29 2025 1:33 PM

ఏషియన్‌ అడ్మిరబుల్‌ అచీవర్స్‌లో మధుసూదన్‌కు స్థానం

ఏషియన్‌ అడ్మిరబుల్‌ అచీవర్స్‌లో మధుసూదన్‌కు స్థానం

మార్కాపురం: గిన్నిస్‌ బుక్‌తో సమానమైన ఏషియన్‌ అడ్మిరబుల్‌ అచీవర్స్‌ బుక్‌లో మార్కాపురం పట్టణానికి చెందిన డాక్టర్‌ కప్పగంతుల మధుసూదన్‌శాస్త్రికి స్థానం దక్కింది. సంబంధించిన పత్రాలను అందుకున్న ఆయన అవార్డు వివరాలను బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆసియా ఖండంలో విశిష్ట సేవలు, అత్యంత ప్రతిభ కనపరిచిన వారి విశేషాలను ఈ బుక్‌ ప్రచురిస్తుంది. ఈ ఏడాది విడుదల చేసిన బుక్‌లో మొత్తం 498 మంది వివరాలు ఉండగా అందులో 13వ వాల్యూంలో మధుసూదన్‌శాస్త్రి వివరాలు నమోదు చేశారు. 

1980 నుంచి న్యూఢిల్లీకి చెందిన రవిభూషన్‌ ఏషియన్‌ అడ్మిరబుల్‌ అచీవర్స్‌ బుక్‌ ప్రచురిస్తున్నారు. ఈ పుస్తకంలో మధుసూదన్‌ తండ్రి వేణుగోపాల కృష్ణమూర్తి 1988లో చోటు సంపాదించడం విశేషం. ఈ సందర్భంగా ఆయనను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోపాలుని హరిహారరావు, విశ్రాంత విద్యాశాఖ ఆర్‌జేడీ డాక్టర్‌ అన్నపురెడ్డి వీరారెడ్డి, జెడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం చంద్రశేఖరరెడ్డి తదితరులు అభినందించారు.

హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవం

మార్కాపురం టౌన్‌: హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మార్కాపురంలోని జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి ఎం.శుభవాణి బుధవారం తీర్పు వెల్లడించారు. తర్లుపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందిన పఠాన్‌ ఖాశింఖాన్‌ను 2015 జూన్‌ 21న మార్కాపురం మండలంలోని రాయవరం సమీపంలో బాషా టిఫిన్‌ బంకు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తన భర్తకు వ్యవసాయ భూమి విషయంలో షేక్‌ సుబానీ, అతని మనుషులతో గొడవలు జరిగాయని, వారే హత్య చేసి ఉండవచ్చని మార్కాపురం రూరల్‌ పోలీసులకు ఖాశింఖాన్‌ భార్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పటి సీఐ కరుణాకర్‌రావు కేసు దర్యాప్తు చేశారు. తర్లుపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందిన పఠాన్‌ సుబానీ అలియాస్‌ గడ్డ అలియాస్‌ గడ్డగాడు, రాయవరం రైల్వేస్టేషన్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ బాషా అలియాస్‌ లేషా, ఇదే ప్రాంతానికి చెందిన సయ్యద్‌ మాబుసుబానీ, సయ్యద్‌ బడే హుస్సేన్‌ను నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. 

కోర్టు ట్రయల్‌ నడుస్తున్న క్రమంలో సయ్యద్‌ మాబుసుబానీ, సయ్యద్‌ బడే హుస్సేన్‌ మృతి చెందారు. బుధవారం తుది విచారణలో నేరం రుజువు కావడంతో పఠాన్‌ సుబానీ, షేక్‌ బాషాకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని అడిషినల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆర్‌.బాలునాయక్‌ పేర్కొన్నారు. ఒక్కో నిందితుడికి రూ.1,000 చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. నేరస్తులకు శిక్ష పడేలా కోర్టులో సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టిన అప్పటి సీఐ కరుణాకర్‌రావు, ప్రస్తుత సీఐ సుబ్బారావు, రూరల్‌ ఎస్సై అంకమరావు, లైజన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఐవీ శ్రీనివాసరావు, కానిస్టేబుల్‌ కిషోర్‌కుమార్‌ను ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement