
అమరావతి రీలాంచ్ పేరుతో రూ.700 కోట్లు వృథా
ఒంగోలు సిటీ:
అమరావతి రీలాంచ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. ఆదివారం ఒంగోలుకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ వచ్చి చేసిందేమీ లేదని, ఆయన ఏదో ఇచ్చేస్తారని కూటమి నేతలు ఆర్భాటం చేశారని, అయితే ఆయన పవన్ కళ్యాణ్ చేతిలో చాక్లెట్ పెట్టారని ఎద్దేవా చేశారు. గతంలో న్యాయమూర్తుల పర్యవేక్షణలో రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు కేటాయిస్తూ వచ్చారని, మీరు అధికారంలోకి వచ్చాక దానికి స్వస్తి పలికి మీ సొంతవాళ్లకి పనులు కేటాయించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందన్నారు. చదరపు అడుగుకు రూ.1800 అయ్యే చోట రూ.10,065 ఖర్చు చేస్తూ ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారని ఆరోపించారు. జాతీయ రహదారుల నిర్మాణాల విషయంలో కిలోమీటరుకు రూ.25 కోట్లకు ఇస్తుంటే.. మీరు రూ.60 కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సంపద సృష్టించి ప్రజలకు లబ్ధి చేకూరుస్తానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారని, ప్రస్తుతం జరుగుతున్నది చూస్తుంటే మీ ఇంట్లోవారికి సంపద సృష్టిస్తున్నారన్న అనుమానం కలుగుతోందని విమర్శించారు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చేశారని నాడు ప్రధాని మోదీ ఆరోపించారని, నేడు అమరావతిని ఏటీఎంగా మార్చేసుకున్నారని కారుమూరి ధ్వజమెత్తారు. అమరావతిలో చేపడుతున్న నిర్మాణాల్లో రూ.లక్షల కోట్ల పనులకు టెండర్లు పిలుస్తూ దోచేస్తున్నారని విమర్శించారు. పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ ప్రజలపై భారాన్ని మోపుతున్నారన్నారు.
భ్రమరావతి పేరుతో రైతులను గాలికొదిలేశారు..
భ్రమరావతి పేరుతో చంద్రబాబు రైతులను గాలికొదిలేశారని మాజీ మంత్రి కారుమూరి విమర్శించారు. ఫీజు రీయింబర్స్ కట్టకపోవడంతో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థుల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పెద్ద ఎత్తున హడావుడి చేశారని, నేడు అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా రేషన్ బియ్యాన్ని దోచేస్తుంటే ఆయన ఎందుకు నోరుమెదపడంలేదని కారుమూరి ప్రశ్నించారు. నాడు సీజ్ద షిప్ అన్నారు.. నేడేమో స్టార్ట్ ద షిప్ అన్న విధంగా పేదల బియ్యం అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలు వాటాలు పంచుకుంటూ పోర్టుల ద్వారా బియ్యాన్ని తరలించేస్తున్నారని ఆయన ఆరోపించారు. సివిల్ సప్లయిస్ మంత్రి రైతుల విషయంలో, బియ్యం దోపిడీ విషయంలో విఫలమయ్యారని విమర్శించారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వం గాలికొదిలేసినా రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరని హెచ్చరించారు. సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చుండూరి రవిబాబు, నగర అధ్యక్షుడు కఠారి శంకర్ పాల్గొన్నారు.
ప్రధాని వచ్చి పవన్ చేతిలో
చాక్లెట్ పెట్టారు
అమరావతిని ఏటీఎంలా వాడుకుంటున్నారు
ప్రతీ నియోజకవర్గంలోనూ
రేషన్ మాఫియా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి ధ్వజం