వీరయ్య కేసులో పుకార్లు షికార్లు | - | Sakshi
Sakshi News home page

వీరయ్య కేసులో పుకార్లు షికార్లు

May 4 2025 7:03 AM | Updated on May 4 2025 7:03 AM

వీరయ్య కేసులో పుకార్లు షికార్లు

వీరయ్య కేసులో పుకార్లు షికార్లు

ఒంగోలు టౌన్‌: తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య జరిగి రెండు వారాలు కావస్తోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు ఇప్పటికీ విచారణ దశలోనే ఉండడంతో రోజుకో రకంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరయ్య హత్యలో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా టీడీపీ నాయకులే కావడంతో కేసు విచారణ విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హత్య విచారణ ఆలస్యమవుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వీరయ్య కేసులో ప్రధాన అనుమానితులను చాలా మందినే పోలీసులు విచారించారు. ఇంకా విచారిస్తూనే ఉన్నారు. అయినా ఇంకా కొలిక్కిరాలేదని చెబుతున్నారు.

ఆ నలుగురూ నెల్లూరు వాళ్లేనా...

ఏప్రిల్‌ 22వ తేదీన ఒంగోలులోని జాతీయ రహదారికి అనుకొని ఉన్న కార్యాలయంలో ఉన్న వీరయ్య చౌదరిని నలుగురు యువకులు కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఎస్పీ కార్యాలయం, తాలూకా పోలీసు స్టేషన్లకు కూత వేటు దూరంలో ఈ హత్య జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. హత్య తరువాత ఒక స్కూటీ మీద ఇద్దరు, మరో మోటారు బైకు మీద మరో ఇద్దరు నిందితులు పారిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ నలుగురిలో ఇద్దరు మాత్రం చీమకుర్తి సమీపంలో ఒక డాబా పక్కన స్కూటీని నిలిపివేసి కనిగిరి ఆర్టీసీ బస్సెక్కి పొదిలి వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మిగిలిన నిందితులు ఎటు వైపు వెళ్లారన్నది నిర్ధారణ కాలేదు.

అయితే ఇప్పటి వరకు ఒంగోలు నగర శివారులోని కొప్పోలులో ఒక ప్రైవేటు పాఠశాల సమీపంలో నివశించే వ్యక్తి నేరుగా హత్యలో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అది ఎంత వరకు నిజమో పోలీసులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. అసలు హత్యలో పాల్గొన్న నలుగురు కూడా నెల్లూరుకు చెందిన పాత నేరస్తులేనన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై తే నెల్లూరు నుంచి ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. మిగతా ఇద్దరి కోసం పోలీసులు విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలోని పలు పట్టణాల్లో గాలిస్తున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా తడ పరిసరాల్లో కూడా నిందితుడి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కొప్పోలు అనుమానితుడిపైనే ప్రధాన దృష్టి

అయితే వీరయ్య చౌదరి హత్య జరిగినప్పటి నుంచి కొప్పోలుకు చెందిన వ్యక్తి మీదే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో అతడు స్వయంగా పాల్గొనడమే కాకుండా మిగతా నిందితులను కూడా అతడే సమకూర్చినట్లు ప్రచారం జరుగుతోంది. హత్యకు ముందు నిందితులు నగరంలోని గుంటూరు రోడ్డులో ఒక లాడ్జీలో ఉన్నారని, వారికి కొప్పోలు వ్యక్తే భోజనాలను పంపించేవాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. హత్య జరిగిన తరువాత వైజాగ్‌ పారిపోయినట్లు చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు అతడు వైజాగ్‌లోనే తలదాచుకునే ఉన్నాడో లేక ఎక్కడికై నా జారుకున్నాడో తెలియదు. అతడు దొరికితే కీలకమైన వ్యక్తులు దొరికే అవకాశం ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

పాత్రధారులంతా నెల్లూరు వాళ్లేనని ప్రచారం హత్య జరిగి రెండు వారాలు కావస్తున్నా దొరకని నిందితులు ఇప్పటికే పోలీసుల అదుపులో ప్రధాన అనుమానితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement