
మంత్రి గారికి ముహూర్తం కుదర్లేదట..!
మార్కాపురం: మార్కాపురం జీజీహెచ్లో సుమారు నెలరోజుల క్రితం ఐసీయూ వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, అందులో 12 వెంటిలేటర్లను బిగించారు. వాటికి అనుసంధానంగా బీపీ మిషన్, పల్స్ మిషన్, ఆక్సోమీటర్లను అమర్చారు. అయితే సంబంధిత శాఖా మంత్రికి ముహూర్తం కుదరకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులు అంబులెన్స్లో ఒంగోలుకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. మార్కాపురం జీజీహెచ్లో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మూడు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి జిల్లా వైద్యశాలను జీజీహెచ్గా మార్చి సుమారు 72 మంది వైద్యులను, ప్రొఫెసర్లను నియమించారు. అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పశ్చిమ ప్రకాశంతోపాటు కనిగిరికి చెందిన వారు కూడా ఇక్కడికి వచ్చి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పొందారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మెడికల్ కాలేజీపై చిన్నచూపు చూడటంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. జీజీహెచ్లో పనిచేస్తున్న సుమారు 45 మంది వైద్యులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. 500 పడకలతో ఏర్పాటుచేసిన జీజీహెచ్ వైద్యులు లేక, ఓపీ తగ్గి వెలవెలపోతోంది. మరోవైపు గత ప్రభుత్వంలోనే ఐసీయూ వార్డులు, వెంటిలేటర్లు మంజూరు చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో వాటిని నిలిపివేశారు. పశ్చిమ ప్రకాశంలో నల్లమల అటవీ ప్రాంతం, ఘాట్ రోడ్డు ఎక్కువగా ఉండటంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అనంతపురం, విజయవాడ నేషనల్ హైవే, మార్కాపురం–ఒంగోలు స్టేట్ హైవే, దోర్నాల–శ్రీశైలం, దోర్నాల–ఆత్మకూరు, గిద్దలూరు–నంద్యాల, యర్రగొండపాలెం–మాచర్ల ఘాట్ రోడ్డు ఉంది. ఈ ప్రాంతంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగి తీవ్ర రక్తస్రావమై క్షతగాత్రులు ప్రాణాపాయ స్థితిలో జీజీహెచ్కు వస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో వారి ప్రాణాలను నిలబెట్టేందుకు ఐసీయూ వార్డుల్లో వెంటిలేటర్లు తప్పనిసరి. వీటితోపాటు పలువురు ఆత్మహత్యలకు పాల్పడటం, పురుగు మందు తాగడం తదితర కారణాలతో ప్రాణాపాయ పరిస్థితుల్లో జీజీహెచ్కు వస్తారు. వీరికి కూడా ప్రాణాలు నిలబెట్టేందుకు వెంటిలేటర్పై ఉంచాలి. అయితే ఐసీయూ వార్డులో వెంటిలేటర్లు ఏర్పాటు చేసి నెల రోజులు దాటినా ప్రజాప్రతినిధులకు డేట్ కుదరక ప్రారంభించకపోవడంతో జీజీహెచ్కు ప్రాణాపాయ స్థితిలో వచ్చినవారు ఒంగోలుకు వెళ్లాల్సిన పరిస్థితి. త్వరగా ఐసీయూ వార్డును ప్రారంభించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
అన్నీ సిద్ధంగా ఉన్నా ముహూర్తం లేక ప్రారంభం కాని ఐసీయూ వార్డ్ జీజీహెచ్లో 12 వెంటిలేటర్ల ఏర్పాటు ప్రస్తుతం అత్యవసరమైతే ఒంగోలుకు తరలింపు
త్వరలో ప్రారంభిస్తాం
మార్కాపురం జీజీహెచ్లో ఏర్పాటు చేసిన ఐసీయూ వార్డ్, 12 వెంటిలేటర్లను త్వరలో ప్రారంభించి రోగులకు అందుబాటులోకి తెస్తాం. జీజీహెచ్లో ప్రస్తుతం ఉన్న వైద్యులతోనే మంచి వైద్యసేవలు అందిస్తున్నాం. మందుల కొరత లేదు.
– డాక్టర్ రామచంద్రరావు, సూపరింటెండెంట్, జీజీహెచ్, మార్కాపురం

మంత్రి గారికి ముహూర్తం కుదర్లేదట..!