
డిప్యూటీ స్పీకర్ క్షమాపణలు చెప్పాలి
ఒంగోలు టౌన్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావును ఉద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ డిమాండ్ చేశారు. రఘురామకృష్ణరాజు చేత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు క్షమాపణ చెప్పిస్తారో లేక స్వయంగా బాధ్యత వహిస్తారో సమాధానం చెప్పాలన్నారు. డిప్యూటీ స్పీకర్ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ బస్టాండు సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఎంతోమంది రాజకీయ నాయకులు కాలగర్భంలో కలిసి పోయారని మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కె మాబు మాట్లాడుతూ.. రఘురామకృష్ణరాజు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలోని పాలకోడేరు గ్రామంలో 30 ఏళ్లకు పైగా నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చివేసిన ఘటనపై సీపీఎం కార్యదర్శి సందర్శించినందుకు డిప్యూటీ స్పీకర్ సంయమనం కోల్పోయి మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఒక జాతీయ పార్టీ నేతను పట్టుకొని బతికి పోయావు పో అంటూ బెదిరింపులకు దిగిన డిప్యూటీ స్పీకర్ వ్యవహారంపై కూటమి పాలకులు స్పందించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న నాయకుడు అప్రజాస్వామికంగా మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో త్యాగం చేస్తున్న జాతీయ పార్టీ నాయకుల పట్ల డిప్యూటీ స్పీకర్ అనుచితంగా మాట్లాడడం క్షమార్హం కాదన్నారు. రాష్ట్రంలో బుల్డోజర్ సంస్కృతికి స్వస్తి పలకాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ..రఘురామకృష్ణరాజు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ నిరసనలో పి.కల్పన, కంకణాల రమాదేవి, జీ.ఆదిలక్ష్మి, కాలం సుబ్బారావు, జాలా అంజయ్య, సీహెచ్ వినోద్, టి.మహేష్, తంబి శ్రీనివాసరావు, శ్రీరాం శ్రీనివాసరావు, తోట తిరుపతిరావు, భక్తసింగ్ రాజు, బీవీ రావు, కొత్తకోట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.