
టైరు పంక్చరై లారీ బోల్తా
పెద్దారవీడు: వేగంగా వెళ్తున్న లారీ టైరు అకస్మాత్తుగా పంక్చర్ కావడంతో లారీ బోల్తా పడింది. పెద్దారవీడు మండలంలోని గొబ్బూరు–తోకపల్లి గ్రామాల మధ్య ఆదివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా సీతారామపురం గ్రామం నుంచి సజ్జల లోడు లారీ హైదరాబాద్ వైపు వెళ్తోంది. ఆ సమయంలో లారీ టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ కార్తీక్ వేగాన్ని అదుపుచేసి రోడ్డు పక్కన నిలిపేందుకు ప్రయత్నించగా, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి లారీ బోల్తాపడింది. లారీలో డ్రైవర్, క్లీనర్, ఇద్దరు కూలీలు ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే మరో లారీలో సజ్జల బస్తాలు లోడ్ చేసి పంపించారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని
వృద్ధురాలి మృతి
సింగరాయకొండ: ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని మతిస్థిమితం లేని మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్టాండ్ లోపలి గేటు సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..ఆర్టీసీ బస్సు బస్టాండ్ లోపలి గేటు గుండా వెళ్లే ప్రయత్నంలో ఆ సమయంలో బస్సుకు అడ్డంగా వచ్చిన మహిళను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి గురించి వివరాలు తెలిసిన వారు పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్సై బి.మహేంద్ర తెలిపారు.
ప్రాణం తీసిన ఈత సరదా
● నీటి కుంటలో పడి బాలుడు మృతి
కనిగిరి రూరల్: ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన కనిగిరి మండలంలోని భూతంవారిపల్లిలో జరిగింది. భూతంవారిపల్లికి చెందిన సీ శ్రీను కుమారుడు చిన్ని (12) కంచర్లవారిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో గ్రామానికి చెందిన తోటి స్నేహితుడితో కలిసి ఊరి చివర ఉన్న నీటి కుంట దగ్గరికి వెళ్లాడు. చిన్ని సరదాగా ఈత కొట్టేందుకు నీటి గుంతలో దిగాడు. గుంత లోతుగా ఉండటంతో లోపలికి వెళ్లిన చిన్ని తిరిగి పైకి రాలేదు. దీంతో పక్కనే ఉన్న బాలుడు ఆందోళన చెంది గ్రామస్తులకు తెలియజేశాడు. వారు వెంటనే వచ్చి నీటి కుంటలో నుంచి చిన్నిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో విషాదం అలముకుంది.

టైరు పంక్చరై లారీ బోల్తా