
ఐపీఎస్ కల నెరవేరిన వేళ..
సింగరాయకొండ: గ్రూప్–1 పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఏఎస్, ఐపీఎస్ కావాలన్న ధృఢ సంకల్పంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి చివరి ప్రయత్నంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో 350 ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నాడు సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన మూలగాని ఉదయ్ కృష్ణారెడ్డి. చిన్నప్పుడే తండ్రి శ్రీనివాసులరెడ్డి, తల్లి జయమ్మలను పోగొట్టుకున్న ఉదయ్ కృష్ణారెడ్డి, తమ్ముడు ప్రణయ్ రెడ్డి తో కలిసి నాయనమ్మ రమణమ్మ సంరక్షణలో ఉన్నాడు. రమణమ్మ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ తన ఇద్దరు మనవళ్లను చదివించింది. చిన్నప్పటి నుంచి పట్టుదలతో చదివిన ఉదయ్ కృష్ణారెడ్డి 2012వ సంవత్సరంలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి నెల్లూరు జిల్లా గుడ్లూరు మండల పోలీస్స్టేషన్ లో ఉద్యోగంలో చేరాడు. తరువాత రామాయపట్నం మైరెన్ కానిస్టేబుల్గా బదిలీ అయ్యాడు. ఆ సమయంలో మైరెన్ సీఐ దురుసు ప్రవర్తనతో ఆవేదన చెంది ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ పరీక్ష రాసి ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలని నిశ్చయించుకుని కఠోర కృషి చేశాడు. గత సంవత్సరం సివిల్స్లో 780 మార్కులు సాధించి ఐఆర్ఎంఎస్కు ఎంపికయ్యాడు. కానీ చిన్నప్పటి నుంచి సివిల్స్ లో ర్యాంకు సాధించి కలెక్టర్ లేదా ఎస్పీ కావాలన్న కోరికతో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి 2019వ సంవత్సరంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వెళ్లి సివిల్స్కు ప్రిపేర్ అయ్యాడు. ఇప్పటికి నాలుగు సార్లు పరీక్షలు రాయగా మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లినప్పటికీ 9 మార్కులు తగ్గాయి. రెండో సారి, మూడో సారి పరీక్షలకు ప్రిపేర్ అయినప్పటికీ ప్రిలిమ్స్ దశలోనే వెనుదిరిగాడు. నాలుగో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో 780 వ ర్యాంకు, 5వ సారి చివరి ప్రయత్నంలో 350 మార్కులు సాధించి ఐపీఎస్ కావాలన్న తన కోరిక తీర్చుకున్నాడు. దీనిపై ఉదయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఐఏఎస్కానీ, ఐపీఎస్ కానీ కావాలన్నది తన కోరికని ఈ ర్యాంకు ప్రకారం ఐపీఎస్కు ఎంపికవుతానని, ఐఏఎస్కు ఎంపిక కావటానికి 10 శాతం అవకాశాలున్నాయని వివరించాడు. ఈ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డిని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్, గ్రామస్తులు అభినందించారు.