
ఆన్లైన్ అర్జీలను కూడా పరిశీలించాలి
ఒంగోలు సబర్బన్: ఆన్లైన్లో వచ్చే అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. మీ కోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో మీ కోసం భవన్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రతి రోజు లాగిన్ అయి ఆన్లైన్లో వచ్చిన వినతులను చూడాలన్నారు. సాంకేతిక సమస్యల వలన క్షేత్రస్థాయిలో పరిష్కరించలేని అర్జీలు వస్తే ఆ విషయాన్ని ప్రజలకు అప్పుడే స్పష్టం చేయాలన్నారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. మీ కోసం కార్యక్రమంలో వచ్చే అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితిల్లో అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని స్పష్టం చేశారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ‘మీ కోసం’ కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నందున ప్రతి ఒక్క ఆర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వాటికి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కారం చూపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, వరకుమార్, డిప్యూటీ కలెక్టర్ పార్ధసారథితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గడువులోగా అర్జీలను పరిష్కరించాలి మీ కోసంలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా