● కలెక్టర్ దినేష్ కుమార్కు ఎమ్మెల్యే తాటిపర్తి వినతి
యర్రగొండపాలెం: నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని, ఆయా ప్రాంతాల్లో శాశ్వత నీటి పథకాలను అమలుపరచి సమస్య పరిష్కరించాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు. మంగళవారం ఒంగోలులో కలెక్టర్ దినేష్ కుమార్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఆయన కలెక్టర్తో చర్చించి వినతి పత్రం ఇచ్చారు. తీవ్ర నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో సరఫరా చేసిన ట్యాంకర్ల యజమానులకు గత 14 నెలల బిల్లులు రావలసి ఉందని, వాటిని తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు. అస్తవ్యస్తంగా ఉన్న యర్రగొండపాలెం–త్రిపురాంతకం రోడ్డు పనులతో పాటు నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రహదారుల అభివృద్ధి పనులను వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ వర్గీయులు దాడులకు దిగుతున్నారని, త్రిపురాంతకంలో చెత్త సేకరించే వాహనాన్ని, యర్రగొండపాలెం మండలంలోని వీరభద్రాపురంలో సచివాలయ బోర్డులను ధ్వంసం చేయడం, నియోజకవర్గంలో జరిగే అల్లర్ల గురించి ఆయన కలెక్టర్తో చర్చించారు. పెండింగ్లో ఉన్న పట్టాలను పేదలకు పంపిణీ చేయాలని, నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి పనులు పూర్తయ్యేందుకు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment