ఒంగోలు: ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 6694 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ పరీక్షలకు 4927 మంది, పదో తరగతి పరీక్షలకు 1767 మంది హాజరుకానున్నారు. పరీక్ష ప్రతి రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. ఇంటర్ పరీక్షల నిర్వహణకు 22 కేంద్రాలు, పదో తరగతి పరీక్షలకు 9 కేంద్రాలు ఎంపిక చేశారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్లు, జాయింట్ కస్టోడియన్ల నియామకం పూర్తిచేశారు.
చీటీల పేరుతో రూ.73 లక్షల మోసం
ఒంగోలు టౌన్: చీటీ పాటల పేరుతో లక్షలాది రుపాయలు వసూలు చేసి రాత్రికి రాత్రి ఉడాయించిన దంపతులను పట్టుకొని తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని పలువురు బాధితుల తరుఫున మరాఠిపాలేనికి చెందిన ఎం అంజనీకుమారీ వన్టౌన్ పోలీసుస్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని గద్దలగుంటకు చెందిన తోటపల్లి లక్ష్మీ రాజ్యం ఆమె భర్త వెంకటేశ్వరరావు చీటీపాటలు వేసేవారు. కొంతకాలం నమ్మకంగా డబ్బులను తిరిగి ఇస్తుండడంతో వారి వద్ద పలువురు చీటీపాటలను వేశారు. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఆ దంపతులు గత ఏడాది ఆగస్టులో గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. లక్ష్మీ రాజ్యం వద్ద మాకు దాదాపుగా రూ.73 లక్షల వరకు డబ్బులు రావాల్సి ఉందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వన్టౌన్ ఎస్సై వై.శ్రీహరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.