
సైన్స్ గ్రూపులు ప్రారంభించాలని కలెక్టర్ను కోరుతున్న విద్యార్థినులు
సింగరాయకొండ: జగనన్న కాలనీల్లో గృహాలు నిర్మించుకోని లబ్ధిదారుల నివేశన స్థలం పట్టాలు చేస్తామని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం సింగరాయకొండ మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. సోమరాజుపల్లి పంచాయతీ నర్రావానిపాలెం లేఔట్లో శుక్రవారం లబ్ధిదారులు, అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుక, ఇనుము కొరత లేదని, బిల్లులు కూడా వేగంగా మంజూరు చేస్తున్నామని, డాక్రా సంఘాల సభ్యులకు రూ.35 వేల రుణం అందజేస్తున్నట్లు తెలిపారు. లేఔట్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. అయినా గృహ నిర్మాణాలు చేపట్టకపోవడానికి గల కారణాలను లబ్ధిదారులు, ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారికి ఇళ్లు ఉచితంగా నిర్మించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయని, ఎస్టీలకు ఒకే చోట ప్లాట్లు కేటాయిస్తే పనులు ప్రారంభించేలా చూస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం పాతసింగరాయకొండ సచివాలయాన్ని పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ నమోదు చేయించాలని ఆదేశించారు. తదనంతరం వరాహ లక్ష్మీనరసింహస్వామి హాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రస్టు బోర్డు చైర్మన్ పామర్తి మాధవరావు, ఈఓ పి.కృష్ణవేణి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు ఉదయగిరి వెంకట శేష లక్ష్మీనరసింహాచార్యులు కలెక్టర్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆశీర్వచనం అందజేసి ఘనంగా సత్కరించారు.
నాడు–నేడు పనుల నాణ్యతలో రాజీపడొద్దు
పాతసింగరాయకొండ జెడ్పీ హైస్కూల్లో నాడు–నేడు పనులను పరిశీలించిన కలెక్టర్ నాణ్యతలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. ఇన్చార్జి డీఎల్డీఓ ఉషారాణి, మండల ప్రత్యేకాధికారి చంద్రశేఖరరెడ్డి, గృహనిర్మాణశాఖ పీడీ పేరయ్య, ఈఈ ప్రసాద్, డీఈ జయరావు, ఏఈ నాగరాజు, ఎంపీడీఓ షేక్ జమీఉల్లా, తహసీల్దార్ సీహెచ్ ఉష, పీఆర్ ఏఈ శ్రీహరి పాల్గొన్నారు.
అందరికీ ఒకేలా పరిహారం ఇవ్వండి
రైల్వే మూడో లైను ఏర్పాటుతో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఒకే విధంగా అందించాలని బాధిత రైతులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఫేజ్–1లో సెంటుకు రూ.11 వేలు ఇవ్వగా, రెండో ఫేజ్లో మాత్రం రూ.78 వేలు ఇచ్చారని స్థల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లెక్కన పరిహారం తీసుకుంటే కోట్ల రూపాయలు తేడా వస్తోందని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారు. తహసీల్దార్ సీహెచ్ ఉష, రైల్వే ఇంజినీరింగ్ అధికారి ఓఆర్ సురేష్, రైల్వే కాంట్రాక్టర్ అశోక్ ఉన్నారు.
జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు
కలెక్టర్ దినేష్కుమార్ హెచ్చరిక
సింగరాయకొండ మండలంలో సుడిగాలి పర్యటన
ఎంపీసీ, బైపీసీ కోర్సులు ప్రారంభించాలి
సింగరాయకొండ మండల పర్యనటలో భాగంగా తొలుత స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇంటర్మీడియెట్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు తిరిగి ఏర్పాటు చేయాలని పదో తరగతి విద్యార్థులు కోరగా సానుకూలంగా స్పందించారు. 82 మంది విద్యార్థినుల్లో 80 మంది బైపీసీ, ఎంపీసీలో చేరతామని చెప్పగా.. సాంఘిక సంక్షేమ శాఖామంత్రి మేరుగ నాగార్జున, గురుకుల పాఠశాలలల ప్రిన్సిపల్ సెక్రటరీ పావనమూర్తితో కలెక్టర్ ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. రాష్ట్రంలో 4 పాఠశాలల్లో కొత్తగా సైన్స్ గ్రూపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, జిల్లా నుంచి ప్రతిపాదనలు వస్తే అనుమతి మంజూరుకు కృషి చేస్తామని వారిద్దరు కలెక్టర్కు తెలియజేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ స్పందించిన తీరుపై విద్యార్థినులు ముగ్దులై కృతజ్ఞతలు తెలిపారు.

కలెక్టర్కు సమస్యను వివరిస్తున్న రైల్వే భూసేకరణ బాధితులు

నర్రావానిపాలెం జగనన్న లేఔట్లో అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ దినేష్కుమార్