కోల్కతా: బెంగాల్లో నైతిక విజయం తమదేనని అంటున్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఓట్లను, సీట్లను చోరీ చేసి బీజేపీ గెలిచిందని విమర్శించారు. అదే సమయంలో తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోక్భవన్కు వెళ్లనని, అక్కడకు వెళ్లి రాజీనామా చే యాల్సిన అవసరం కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తాము ఓడిపోలేదని, బీజేపీ సీట్లు దొంగిలించిన కారణంగానే ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు. తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మమతా, కోల్కతా నుంచి ప్రెస్మీట్లో మాట్లాడుతూ..‘ మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. 100 సీట్లను బిజెపి దొంగిలించింది. ఇది బీజేపీ విక్టరీ కాదు.. లూటీ. బెంగాల్ ఎన్నికల్లో ఈసీ విలన్. ప్రతిపక్ష నేతలు వేధించడం బిజెపికి అలవాటు. మా నాయకులపై వేధింపులు మొదలయ్యాయి. ఇండియా బ్లాక్ కోసం మరింత గట్టిగా పని చేస్తా.
ఈసీ బీజేపీ ఏజెంట్గా పనిచేసింది. ఎన్నికలకు రెండురోజుల ముందే టీఎంసీ నేతల్ని అరెస్ట్ చేశారు. బెంగాల్లో మాది ఓటమి కాదు. బీజేపీ చోరీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం మా పాలిట విలన్. మేం విలన్లపై పోరాటం చేశాం. కౌంటింగ్ సెంటర్లలో మా ఏజెంట్లను అనుమతించలేదు. SIR ప్రక్రియలో మోదీ, అమిత్ షా తలదూర్చారు. బీజేపీ ఓట్ల చోరీపై పోరాడుతాం. సీఆర్పీఎఫ్ బలగాలు మా పాలిట గూండాల్లా మారాయి. బీజేపీకి ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేయడం అలవాటే. మాకు ఇండియా బ్లాక్ మద్దతు ఉంది’ అని స్పష్టం చేశారు.
కాగా, నిన్న(సోమవారం) వెలువడిన బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 200పైగా సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. బీజేపీ ప్రభంజనంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 100 సీట్ల మార్కును కూడా దాటలేకపోయింది.


