ఢిల్లీ: కేరళ సీఎం ఎవరన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎవరన్న విషయం గురించి ప్రతిసారి ఇటువంటివే రిపీట్ అవుతుంటాయి. ఈ సారి కూడా అదే జరుగుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో కేరళ కాంగ్రెస్ నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ సన్నీ జోసెఫ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి, ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ పాల్గొన్నారు. కేరళ సీఎం రేసులో వీడీ సతీశన్, రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. వీరు ముగ్గురు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
ఇటీవల కేరళలో గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కాంగ్రెస్ పరిశీలకులు సేకరించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలపై అధిష్ఠానానికి నివేదిక ఇచ్చారు. కేరళలో కీలకమైన ముగ్గురు నేతలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనుంది ఏఐసీసీ. ఆ తర్వాత కేరళ సీఎం ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కేసీ వేణుగోపాల్కు అధిక మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. బలమైన నాయకత్వం, అందర్నీ కలుపుకొని పాలన చేయగల సామర్థ్యం ఉన్న నాయకుడికి కేరళ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. కేరళలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ విజయంతో దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో మూడింటిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉంటున్నారు.
కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేశ్ చెన్నితల ముగ్గురూ నాయర్ సమాజానికి చెందినవారే. నాయర్లు కేరళ జనాభాలో సుమారు 12 శాతం మాత్రమే. వేణుగోపాల్ (63 ), సతీశన్ (62), చెన్నితల (70) ఈ ముగ్గురిలో చెన్నితల సీనియర్.. అనుభవం ఎక్కువ. కేసీ వేణుగోపాల్.. రాహుల్ గాంధీకి అత్యంత విశ్వాసపాత్రుడు, సన్నిహితుడు. ఎన్నికల సమయంలో అసంతృప్త నాయకులకు సర్దిచెప్పి, పార్టీని ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించారు
అయితే, గత ఏడేళ్లుగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన పనితీరుపై విమర్శలు కూడా ఉన్నాయి. విద్యార్థి రాజకీయాల్లో ప్రారంభించి, రాష్ట్ర-కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేరళకు తిరిగి వస్తే ఢిల్లీలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది.


