
వైఎస్ జగన్ చిత్తూరు పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. అరచేయి అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరని, అలాంటిది ముగ్గురు మూర్ఖులు కలిసి జగన్ను ఆపగలిగారా? అని ప్రశ్నించారాయన.
సాక్షి, కృష్ణా జిల్లా: కూటమి నేతలపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు చూసేవాళ్లుగానీ, వినేవాళ్లుగానీ లేకపోవడం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని అన్నారాయన. బుధవారం మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ..
ఈ రాష్ట్రంలో రైతాంగానికి వచ్చిన కష్టం దేశంలో ఎక్కడ చూడలేదు. 164 సీట్లతో గెలిచానని కూటమి నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు. హెలీకాప్టర్లు , ప్రత్యేక విమానాల్లో తమ భార్య పిల్లల వద్దకు తిరుగుతున్నారు. కూటమి నేతలు జనం సొమ్ముతో సోకులు చేసుకుంటున్నారు. అయితే రైతుల కష్టాలు చూసేవాడు కానీ...వినేవాడు కానీ లేకపోవడం మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం.
ధాన్యం రైతుకు గిట్టుబాటు దొరకని పరిస్థితి. పెసలు , మినుములు కొనేవాడు లేక ఇబ్బంది పడుతున్నారు. మామిడి రైతుల వద్దకు జగన్ మోహన్ రెడ్డి వెళ్తానని చెప్పే వరకూ ఒక్కడు కూడా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు బ్రతికే ఉన్నారా?. కర్ణాటక కేంద్రమంత్రికి ఉన్న స్పృహ కూడా ఈ రాష్ట్రానికి లేదు.
ఇప్పుడు.. 3.5 లక్షల టన్నులు కొన్నామని అబద్ధాలు చెబుతున్నారు. నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చామని చెబుతున్నారు.. ఎవరికిచ్చారు?. ఒక్క రైతుకైనా ఇచ్చినట్లు చూపించండి. ముగ్గురు మూర్ఖులు కలిసి వైఎస్ జగన్ను ఇవాళ ఆపగలిగారా?. జగన్ వెళ్తుంటే మార్కెట్ యార్డు మూసేశారు. రైతులను... పంటను కొనే వ్యాపారులను రావొద్దని ఆపేశారు. అరచేయి అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. నిజంగా మీకు చేతనైతే మామిడికి గిట్టుబాటు ధర వచ్చేలా చేయండి అని కూటమి నేతలకు పేర్ని నాని సవాల్ విసిరారు.