టీడీపీకి కొత్త కార్యవర్గాలు

New working groups for TDP - Sakshi

నేడు ప్రకటించనున్న చంద్రబాబు

పార్లమెంటు స్థానాల వారీగా జిల్లా అధ్యక్షులు

రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడికి అవకాశం  

సాక్షి, అమరావతి: టీడీపీ కార్యవర్గాలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షులను మార్చి వారి స్థానంలో కొత్త వారిని నియమించనున్నారు. ప్రస్తుతం 13 జిల్లాల వారీగా పార్టీకి అధ్యక్షులున్నారు. ఇప్పుడు వాటిని పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పునర్వ్యవస్థీకరించి నియమించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలకు కొత్త అధ్యక్షులను ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక అధ్యక్షుడితోపాటు అతనికి సహాయంగా ఇద్దరు నాయకులను కూడా నియమిస్తారు.

ఈ ముగ్గురు సమన్వయ కమిటీగా ఉంటూ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు స్థానంలో కింజరపు అచ్చెన్నాయుడిని నియమించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దాంతోపాటు ఏపీ,  తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాలు, జాతీయ కార్యవర్గాలను చంద్రబాబు ప్రకటించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. గత మే నెలలో మహానాడు జరిగిన వెంటనే వీటిని ఎంపిక చేయాల్సి ఉన్నా ఆలస్యం చేశారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top