
బీజేపీ ఎజెండాలో కార్పొరేట్లే తప్ప పేదలుండరు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
వేములవాడకు వచ్చిన ప్రధాని ఒక్క రూపాయి అయినా ఇస్తామని చెప్పలేదు
బీజేపీ మళ్లీ గెలిస్తే ఆ పార్టీకి 400 సీట్లు రావడం కాదు.. పెట్రోల్ లీటర్ రూ. 400 అవుతుంది
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి గద్దెనెక్కి హామీలను విస్మరించింది
సీఎం సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలను రద్దు చేస్తానంటున్నాడు..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, సిద్దిపేట: ‘నేతన్నల నడ్డి విరిచేలా చేనేతలపై జీఎస్టీ విధించిన తొలి ప్రధాని మోదీయే. నేత కార్మికులకు బీమాతోపాటు ఇతర సదుపాయాలు రద్దు చేశాడు. బీజేపీ ఎజెండాలో కార్పొరేట్లే తప్ప చేనేతలు, కార్మికులు, పేదలు ఉండరు. అబ్ కీ బార్ 400 పార్ కాదు.. బీజేపీ మళ్లీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు రూ. 400 అవుతాయి.
అలవిగాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ వాటి అమల్లో విఫలమైంది’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పాత బస్టాండ్ సమీపంలోని నేతన్న సర్కిల్లో రోడ్ షోతోపాటు సిద్దిపేట పాత బస్టాండ్ అంబేడ్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ప్రధాని వేములవాడకు ఒక్క రూపాయి అయినా ఇస్తామన్నాడా?
లోక్సభ ఎన్నికల బరిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసు. నిన్న ప్రధాని వేములవాడకు వచ్చిండు. బండి సంజయ్ పక్కనే ఉన్నడు. దేశం కోసం ధర్మం కోసం అనే ప్రధాని... పొద్దున లేస్తే హిందూ జపం చేసే బండి సంజయ్ వేములవాడకు ఒక్క రూపాయి అయినా ఇస్తామని చెప్పారా? మోదీ వచ్చి గోదావరిని ఎత్తుకుపోతా అంటున్నారు. గోదావరిని ఎత్తుకుపోతే మనం ఎలా బతుకాలే? అందుకే ఆలోచించి ఓటేయండి. వినోద్కుమార్ పార్లమెంటులో మనకోసం కొట్లాడే వ్యక్తి. 2001 నుంచి తెలంగాణ సాధన ఉద్యమంలో ఉన్నాడు. సీఎం రేవంత్ ఈ జిల్లాను రద్దు చేస్తా అంటున్నాడు. సిరిసిల్ల జిల్లా ఉండాలంటే వినోద్కుమార్ గెలవాలి.
కాంగ్రెస్వి అలవికాని హామీలు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఒక్కటీ అమలు చేయలేదు. అవి అమలు అవుతాయన్న ఆశ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెనెక్కింది. మహిళలకు రూ. 2500, రుణమాఫీ, రైతుబంధు రాలేదు. కరెంట్ లేదు. కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. రంగనాయక సాగర్ను ఎండబెట్టడం వల్ల రైతుల పంటలు కూడా ఎండిపోయాయి. ఉచిత బస్సు ఫెయిల్ అయింది.
మా పాలనలో అందరినీ కాపాడాం..
బీఆర్ఎస్ పాలనలో రూ. 30 వేల కోట్లను రెండు దఫాలుగా రుణమాఫీ చేశాం. డిసెంబర్ 9న రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ ఇప్పటివరకు చేయలేదు. మేం అన్ని వర్గాల ప్రజలను కులమతాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లాం. అందరినీ కాపాడాం. పేదలు, వృద్ధులకు రూ. 2 వేల పెన్షన్ ఇచ్చాం. కాంగ్రెస్ నేతలు పెన్షన్ను రూ. 4 వేలు చేస్తామని చేయట్లేదు. అందుకే రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం ఆలోచించి బీఆర్ఎస్కు ఓటేయండి.
సిద్దిపేటను మేం జిల్లా చేస్తే.. సీఎం రద్దు చేస్తా అంటున్నాడు
ఎనీ్టఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సిద్దిపేట జిల్లా కావాలని అడిగా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నేను సీఎం అయ్యాక సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేశా. జిల్లాకు రైలు, నీళ్లు తెచ్చాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తామంటోంది. ప్రజల చెంతకు పరిపాలన తీసుకురావాలని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే ఈ మూర్ఖ ముఖ్యమంత్రి, ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తాం అంటున్నారు. సిద్దిపేట ప్రజలు ఎటువంటి పులులో నాకు తెలుసు. మీరు పట్టుబడితే.. జట్టుకడితే.. మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి లక్ష మెజారిటీ అందించడం మీకు లెక్కనే కాదు. వెంకట్రామిరెడ్డి గెలుపులోనే సిద్దిపేట జిల్లా గెలుపు ఉంది.
రూ. 5.04 లక్షలు ఇప్పించండి
కొదురుపాకలో మిడ్మానేరు నిర్వాసితుల ప్లకార్డుల ప్రదర్శన బోయినపల్లి (చొప్పదండి): ముంపు గ్రామాల బాధితులైన తమకు రూ. 5.04 లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ మిడ్మానేరు భూ నిర్వాసితులు కేసీఆర్ బస్సు యాత్రలో ప్లకార్డులు ప్రదర్శించారు. తమ సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ శుక్రవారం కరీంనగర్ నుంచి సిరిసిల్లకు వెళ్తుండగా కొదురుపాక వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కేసీఆర్ బస్సు వెళ్లిపోయాక ప్లకార్డులు ప్రదర్శించిన నిర్వాసితులతో స్థానిక బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు.
బజ్జీలు తిని.. చాయ్ తాగి..
బస్సులో వెళ్లే క్రమంలో కేసీఆర్ బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలోని ఓ హోటల్ వద్ద కాసేపు ఆగారు. హోటల్లో కూర్చొని మిర్చీ బజ్జీలు తిని, టీ తాగారు. అక్కడే ఉన్న స్థానికులతో కాసేపు మాట్లాడారు. పలువురు చిన్నారులు కేసీఆర్తో ఫొటోలు దిగారు. కాగా, కొదురుపాక చెక్పోస్టు వద్ద చెక్పోస్టు సిబ్బంది కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేశారు.