
సాక్షి, విజయవాడ: ఏపీలో తల్లికి వందనం పథకంపై కూటమి సర్కార్ మరో డ్రామాకు తెర లేపింది. ‘సాక్షి’ దెబ్బకు జీవో-29పై విద్యాశాఖ కార్యదర్శి తాజాగా మరో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవో-29 కేవలం ఆధార్ కోసమేనంటూ ప్రకటనలో తెలిపింది.
ఇక, తాజా ప్రకటనలోనూ ప్రతీ విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని విద్యాశాఖ చెప్పకపోవడం గమనార్హం. అయితే, ప్రజల్లో కూటమి సర్కార్ తీరుపై విమర్శలు రావడంతోనే విద్యాశాఖ యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. నేడు.. జీవో-29లో తాజాగా తల్లికి వందనం, స్కూల్ కిట్ పథకాల నిబంధనలను విద్యాశాఖ కార్యదర్శి పేర్కొన్నారు.
ఈ నిబంధనల్లో తల్లికి ఏడాదికి రూ.15వేలు మాత్రమే ఇస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. కానీ, విద్యాశాఖ మాత్రం తల్లికి వందనం జీవో ఇవ్వలేదని చెప్పడం విశేషం. కాగా, తాజాగా వివరణ సందర్భంగా కూడా పిల్లలందరికీ రూ.15వేలు ఇస్తామని చెప్పలేదు. ఇదిలా ఉండగా.. జీవో-29 తల్లికి వందనం జీవో అని నిన్న(గురవారం) టీడీపీ అంగీకరించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ ఓవరాక్షన్ కూడా చేసింది. ఇంగ్లీష్ చదవడం నేర్చుకోండని టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాల్లో పోస్టు చేసింది. ఇప్పుడు అదే పోస్టును సోషల్ మీడియా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.