మల్లాపూర్: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో గ్యాస్ కొరతతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద శుక్రవారం ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు బారులుతీరారు. గ్యాస్ సిలిండర్ల స్టాక్ వచ్చిందనే సమాచారంతో వినియోగదారులు ఉదయాన్నే ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్నారు. అందరూ ఒకేసారి గ్యాస్ బుక్ చేసుకోవడంతో అందరికీ సరిపడా సిలిండర్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. గంటల వ్యవధిలోనే పంపిణీ పూర్తవుతుండడంతో నో స్టాక్ బోర్డును పెట్టడంతో అప్పటి వరకు నీరిక్షించిన వినియోగదారులు ఖాళీ సిలిండర్లతోనే నిరసన వ్యక్తం చేశారు. ఏజెన్సీ నిర్వాహకులు రసీదులు ఇచ్చి స్టాక్ వచ్చిన తర్వాత తీసుకెళ్లాలనడంతో చేసేదేమి లేక వెనుదిరుతున్నారు. సిలిండర్ల సరఫరాలో అక్రమాలపై దృష్టి సారించి ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


