
ఎడ్ల నాగలికి భలే గిరాకీ
● పసుపు విత్తనానికి రోజుకు రూ.3500కిరాయి
● ప్రతి గ్రామంలో ఐదారు జతల కాడెద్దులే దిక్కు
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయంలో ట్రాక్టర్లు, ఆధునిక యంత్రాలు రావడంతో కాడెద్దులు కనుమరుగయ్యాయి. గ్రామానికి కేవలం ఐదారు జతల కాడెడ్లు మాత్రమే ఉన్నాయి. విత్తనాలు వేసే సమయంలో వాటికి భలే డిమాండ్ పెరిగింది. పసుపు వంటి విత్తనం వేసేందుకు కాడెడ్లతో వచ్చే రైతుకు రూ.3,500 నుంచి రూ.4వేల వరకు చెల్లించాల్సి వస్తోందంటే గ్రామాల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
పోషణ భారమై..
ఒకప్పుడు గ్రామాల్లో ప్రతి రైతుకు కనీసం నాలుగైదు కాడెడ్లు ఉండేవి. జత కాడెడ్లు లేని రైతులు ఉండేవారు కాదంటే అతిశయోక్తికాదు. సాగులో ట్రాక్టర్ల రాకతో ప్రతి పనికీ యంత్రాలనే వినియోగిస్తున్నారు. చిన్న గ్రామంలోనూ సుమారు 20 నుంచి 30 ట్రాక్టర్లు వచ్చాయి. దీంతో కాడెడ్లను పోషించే స్థోమత రైతులకున్నా.. వాటికి నీరు పెట్టడం, మేత వేయడం వంటి పనులు చేయలేక అమ్ముకుంటున్నారు. నాలుగైదు ఎకరాలు ఉన్న రైతు కూడా ట్రాక్టర్ కొంటున్నాడు.
కాడెడ్లకు గిరాకీ
వాస్తవానికి విత్తనం వేసేందుకు కాడెడ్లు తప్పనిసరి. గతంలో ఇరుగుపొరుగు రైతులు అదలుబదలు రూపంలో విత్తనాలు వేసుకునేవారు. ప్రస్తుతం ఆ విధానం మారింది. కాడెడ్ల నాగలితో విత్తనం వేస్తే బాగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. దీంతో పసుపు విత్తనం వేసేందుకు రైతులు కాడెడ్లపైనే ఆధారపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎడ్లనాగలితో వెళ్తే రూ.3,500 ఇస్తున్నారు. కొందరు రైతులు విత్తనం వేశాక అమ్ముకుంటున్నారు. కాడెడ్ల జతకు రూ.80వేల నుంచి రూ.90వేల వరకు ఉంది.