
స్వీకరణతోనే సరి
● ప్రజావాణిపై పట్టింపు కరువు ● పరిష్కారానికి లభించని మోక్షం ● దరఖాస్తులు స్వీకరించినా తీరని సమస్యలు ● కలెక్టరేట్కు వచ్చినా తప్పని తిప్పలు
సాక్షి, పెద్దపల్లి: ప్రజల ముంగిట్లోకి పాలన రావడ మే కాదు.. వారు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకొ ని పరిష్కరించే లక్ష్యంతో ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో తమ సమస్యలు తీర్చాలని జిల్లా కేంద్రానికొస్తున్న వేలా ది మంది అభాగ్యులు.. ఉన్నతాధికారులకు తమ బాధల్ని ఏకరువు పెడుతున్నారు. కానీ, ప్రభుత్వాని కి ఉన్న బాధ్యత, జవాబుదారీతనం, పారదర్శకత ను ప్రతిఫలించేలా అర్జీలకు అధికారులు పరిష్కారం చూపడంలేదు. కేవలం స్వీకరణతోనే అధికార యంత్రాంగం సరిపెడుతోంది. ఫలితంగా వందలాది దరఖాస్తులు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 443 ఫిర్యాదులు ప్రజావాణికి రాగా, అందులో 187 సమస్యలు పరిష్కరించారు. మిగ తావి పరిష్కారానికి నోచుకోవడం లేదు.
మండలాల్లో నిర్లక్ష్యం..
మండలస్థాయిలో అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని, కలెక్టర్ దష్టికి తీసకెళ్తే మొర ఆలకిస్తారని ఎంతోఆశతో కలెక్టరేట్కు వచ్చేవారికి నిరాశే ఎదురవుతోంది. వ్యయ, ప్రయాసలకోర్చి వ చ్చి వెళ్లడమే తప్ప తమకు ఒరిగేదేమీ లేదంటున్నా రు. జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో అభాగ్యులు ప్రతీసోమవారం ప్రజావాణికి హాజరై ఉన్నతాధికారులకు తమ బాధలు మొరపెట్టుకుంటున్నారు. సంబంధిత శాఖల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా స్పందన లేక కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. కానీ, ఇక్కడా నిరీక్షణ తప్పడంలేదు.
అమలుకు నోచుకోని కలెక్టర్ ఆదేశాలు
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశిస్తున్నారు. ప్రతీ సోమవారం వీటిపై సమీక్షిస్తున్నారు. కొన్ని శాఖలు తమ పరిధిలోని అర్జీలను త్వరగా పరిష్కరిస్తే.. సింహభాగం శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
లెక్కల్లో లేనివి అనేకం..
ప్రజావాణికి వచ్చేవారిలో కొందరే తమ అర్జీలను ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. మిగతావారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆ తర్వాత దరఖాస్తును తమ వెంట తీసుకెళ్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేయిస్తే నంబరు ఆధారంగా సమస్య ప్రగతి వివరం తెలుసుకునే వీలుంటుంది. దరఖాస్తుదారులకు ఈ విషయంపై అవగాహన లేక అధికారులకు అర్జీలు సమర్పించి వెళ్తున్నారు.
ఈ సమస్యలపైనే అధికం..
ప్రజావాణికి కొన్ని సమస్యలపై తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. భూ సమస్యలు, సామాజిక పింఛన్లు, క్షేత్రస్థాయి యంత్రాంగంపై ఫిర్యాదులు, గ్రా మాల్లో మౌలిక వసతులు, భూసేకరణ సమస్యలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ శాఖల రుణాలు, దివ్యాంగుల సమస్యలు, నిరాదరణకు గురవుతున్న వృద్ధులు.. ఇలాంటి అంశాలపైనే ప్రజావాణికి అధికంగా ఫిర్యాదు చేస్తున్నారు.
(పీడీపీ01)
వీరు గోదావరిఖని సమీపంలోని సుందిళ్ల గ్రామస్తులు. సింగరేణి
ఓసీపీ–5లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు సర్వే చేసిన అధికారులు.. తొలుత కొందరికే పరిహారం చెక్కులు అందజేశారు. పరిహారం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రామస్వామి అనే విజిలెన్స్కు ఫిర్యాదు చేయడంతో మిగతా నిర్వాసితులకు పరిహారం ఆగిపోయింది. ఫిర్యాదుదారు అసలు రైతే కాదని నిర్వాసితులు వాపోతున్నారు. ప్రభుత్వం, సింగరేణి అధికారులు స్పందించి అర్హులకు పరిహారం చెల్లించాలని, అనర్హులు ఉంటే విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరారు. ఈమేరకు కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళన చేశారు. ఆ తర్వాత అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.

స్వీకరణతోనే సరి