
‘రామగుండం’లో 60 డివిజన్లు
● డివిజన్ల పునర్విభజనకు కసరత్తు ● మారనున్న బల్దియా స్వరూపం ● ఓటరు జాబితా రూపకల్పనలో వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులు ● నాలుగు గ్రామాలను విలీనం చేసి ఓటర్ల లెక్కింపు ● నేడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అవకాశం
కోల్సిటీ(రామగుండం): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపంలో మార్పు మొదలైంది. ప్రస్తుతమున్న 50 డివిజన్లతోపాటు సమీపంలోని నాలుగు గ్రామాలను విలీనం చేసి 60 డివి జన్లగా విభజించే ప్రక్రియ చేపడుతున్నారు. నగ ర స్వరూపాన్ని మార్చడానికి రెండు రోజులుగా బల్దియా రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో తాజా ఓటరు జాబితా ఆధారంగా ఓటర్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వీటి ఆధారంగా గుర్తించిన మొత్తం ఓటర్లను 60 డివిజన్లుగా విభజిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఓటరు జాబితా కసరత్తు పూర్తిచేసి మంగళవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఓట్ల లెక్కింపులో వార్డు ఆఫీసర్లు..
తాజా ఓటరు జాబితా ఆధారంగా రెవెన్యూ అధికారులు 50 డివిజన్లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. బల్దియా రెవెన్యూ ఆఫీసర్(ఆర్వో) ఆంజనేయులు నేతృత్వంలో ఆర్ఐలు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లతో రెండురోజులుగా ఓట్ల లెక్కింపులో నిమగ్నమయ్యారు.
నాలుగు గ్రామాల ఓట్లు కూడా..
నాలుగు గ్రామాల్లోని ఓట్లను నగరపాలక సంస్థలో విలీనం చేయడానికి తాజా ఓట్లను కూడా లె క్కిస్తున్నారు. రామగిరి మండలం వెంకట్రావుపల్లి, పాలకుర్తి మండలం ఎల్కలపల్లి, అంతర్గాం మండలం లింగాపూర్తోపాటు కుందనపల్లి గ్రా మ పంచాయతీ పరిధి అక్బర్నగర్లోని తాజా ఓట్లను కూడా లెక్కించి నివేదిక తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఈ నాలుగు గ్రామాల విలీన ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మారనున్న బల్దియా స్వరూపం..
రామగుండం నగరపాలక సంస్థ ప్రస్తుతం 93.87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇప్పుడున్న 50 డివిజన్లతోపాటు సమీపంలోని నాలుగు గ్రామాలను విలీనం చేసి 60 డివిజన్లుగా విభజిస్తే బల్దియా స్వరూపం 99.5 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికితోడు బల్దియా జనాభాతోపాటు ఓటర్ల సంఖ్య కూడా పెరుగుతుంది.
నేడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్?
ఓటరు జాబితా ఆధారంగా ఓట్ల సంఖ్య లెక్కిస్తున్న అధికారులు, సోమవారం అర్ధరాత్రి వరకు జాబితా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. మొత్తం 60 డివిజన్ల కోసం లెక్కించిన ఓటర్ల జా బితా ఆధారంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయ డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీచేసి, అభ్యంతరాలకు వారంరోజుల గడవు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఒక్కో డివిజన్లో 3,500 నుంచి 3,080 వరకు ఓటర్లు ఉండేలా నివేదిక తయారు చేస్తున్నారని సమాచారం.