
ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం
సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రభుత్వ పాఠశాలల పూర్వ వైభవానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని 543 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల భవనాలకు మరమ్మతులను మే 31వ తేదీలోపే పూర్తిచేశారు. ఆధునిక హంగులు కల్పించి కార్పొరేట్కు దీటుగా మార్చారు. ఇప్పటికే తల్లిదండ్రులు, ఉపాధ్యాయు లతో సమావేశాలూ నిర్వహించారు. బడి బయట ఉన్న బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. విద్యాబోధనలో మెలకువలు, డిజిటల్ విద్యా విధానంపై ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ పూర్తిచేశారు. ఇంగ్లిష్, గణితం, భౌతిక, జీవశాస్త్రం బోధన తీరుపైనా అవగాహన కల్పించారు.
6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట
ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అత్యధిక మంది విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 12న ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి పండుగ వాతావరణంలో విద్యార్థులను స్వాగతించడానికి స్కూళ్లను అలంకరించేలా చర్యలు తీసుకుంటున్నారు.
బడుల భవనాలకు మరమ్మతులు
తరగతి గదుల్లో మౌలిక వసతులు
సర్కార్ స్కూళ్లు ప్రారంభానికి సిద్ధం
6 నుంచి బడిబాట కార్యక్రమం
విజయవంతం చేయాలి
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇప్పటికే సర్కారు బడుల భవవనాలకు రంగులు వేయడం పూర్తిచేశాం. కొత్త బోర్డులు ఏర్పాటు చేశాం.
– మాధవి, డీఈవో

ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం