
చిట్టీల రాయుళ్లు!
శాతవాహన వర్సిటీలో భారీగా చూచిరాతలు
● డిగ్రీలో డిబార్ అవుతున్న వారిలో కరోనా టైంలో ‘పది’ పాసైన వారే ఎక్కువ ● మొదటి నుంచి ఆరో సెమిస్టర్ వరకు ఇదే తీరు ● పర్యవేక్షణ పెరగడంతో భారీగా పట్టుబడుతున్న విద్యార్థులు ● సోషల్ మీడియా వ్యసనం, చదవలేక పోవ డంతో అడ్డదారులు ● డిబార్ అయిన విద్యార్థికి మద్దతుగా ఉత్తరాది మంత్రి ఫోన్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
కుదురుగా పది నిమిషాలు కూర్చుని పరీక్ష రాయలేరు. పరీక్ష మొదలవగానే.. జేబులో దాచిన మైక్రో జిరాక్స్లు తీయడం, కాపీ చేయడం.. ఇదీ.. శాతవాహన వర్సిటీలో డిగ్రీ విద్యార్థుల తీరు. వాస్తవానికి మునుపెన్నడూ లేని స్థాయిలో విద్యార్థులు చిట్టీలు కొడుతూ పట్టుబడి డిబార్ అవుతున్నారు. గతవారంలో ఒకేరోజు 35 మంది డిబార్ అవడం వర్సిటీ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం. వాస్తవానికి విద్యార్థులు ఇలా చిట్టీలు రాయడం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్న ఆశయంతో యూనివర్సిటీ అధికారులు ఈసారి సిబ్బందిని పెంచి ఆకస్మిక తనిఖీలు చేయిస్తుండటంతో భారీగా చిట్టీల రాయుళ్లు పట్టుబడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా విద్యార్థులు డిబార్ కావడంపై వర్సిటీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. జూన్ 2 వరకు వర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు రాస్తున్న 171 మంది డిబార్ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కరోనా సమయంలోని వారేనా?
ఈ విషయంపై ఆరా తీసినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వాస్తవానికి ఇప్పుడు డిబార్ అవుతున్న విద్యార్థులంతా కరోనా విపత్తు సమయంలో 10వ తరగతి పాస్ అయినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. 2020 మార్చిలో ఆకస్మికంగా కరోనా విపత్తు ప్రపంచాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు నిర్వహించలేకపోయింది. ఫలితంగా ఎలాంటి పరీక్షలు లేకుండా విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత 2021లోనూ పరీక్షలు లేకుండా పది పాసయ్యారు. 2022లో మాత్రం పది పరీక్షలు నిర్వహించినా.. గతంలో ఉన్న 11 పేపర్లను ఆరుకు కుదించి తేలిగ్గా ప్రశ్నలు ఇచ్చారు. 2023లో పది పరీక్షరాసిన పిల్లలు కాస్త నయంగానీ, 2020, 2021లో అసలు పరీక్షలు లేకుండా పాసైన విద్యార్థుల ప్రతిభాపాటవాలపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.
సోషల్ మీడియా మరో కారణం
2020, 2021లో పది పాసైన వారి ప్రతిభాపాటవాలపై ఇప్పుడు ప్రొఫెసర్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. డిబార్ అవుతున్న వారిలో అధికంగా వారే ఉండటం, వారంతా సోషల్ మీడియా ప్రభావంతో కాపీయింగ్ పాల్పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. సులువుగా పరీక్షలు పాసవడానికి అలవాటు పడినవారు, ఆ కోణంలో వెళ్తున్నారని అంటున్నారు. కాపీ కొడితే పట్టుబడ్డారంటూ సోషల్మీడియా రీల్స్ చూసి వీరు కూడా పాటించి దొరికిపోతున్నారని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ ప్రొఫెసర్ తెలిపారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. డిబార్ అయిన విద్యార్థులంతా రాజకీయ నాయకులతో వారిని వదిలేయాలంటూ వర్సిటీ అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నారు. వారిలో ఓ విద్యార్థిని వదిలేయాలంటూ ఉత్తరాదికి చెందిన ఓ పెద్ద మంత్రి ఏకంగా వర్సిటీకి ఫోన్ చేయడంతో విస్తుపోవడం అధికారుల వంతైంది.
వారిలోనే డిబార్ సంఖ్య ఎక్కువ
2020లో పది పాసైనవారు ఇప్పుడు 6వ సెమిస్టర్, 2021లో పది పాసైనవారు 4వ సెమిస్టర్, 2022లో పది పాసైన వారు 2వ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నారు. ప్రతీ విద్యాసంవత్సరంలోనూ 1,3,5వ సెమిస్టర్లకు ఒకసారి, 2,4,6వ సెమిస్టర్లకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. 2023–24లో 1,3,5వ సెమిస్టర్లలో 26 మంది డిబార్ అయ్యారు. అదే 2023–24 విద్యా సంవత్సరంలో 2,4,6 సెమిస్టర్లలో 60 మంది డిబార్కు గురయ్యారు. 2024–25లో 1,3,5వ సెమిస్టర్లలో కేవలం 31 మంది డిబార్ కాగా, 2024–25 విద్యాసంవత్సరంలో 2,4,6 సెమిస్టర్లలో ఏకంగా 140 మంది డిబార్ అయ్యారంటే.. పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో మే 28న ఒకేరోజు 34 మంది డిబార్కావడం గమనార్హం. అందులోనూ కరీంనగర్ నడిబొడ్డున తెలంగాణచౌక్ను ఆనుకుని ఉన్న కాలేజీ నుంచి ఏకంగా 13 మంది విద్యార్థులు ఉండటం విశేషం. ఇప్పుడు డిబార్ అయిన విద్యార్థుల్లో అధికంగా 2020, 2021లో పదో తరగతి పాసైన వారే అధికంగా ఉండటం గమనించదగ్గ అంశం. శాతవాహన యూనివర్సిటీ కింద సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో మొత్తం 120 డిగ్రీ కాలేజీలు, 28 పీజీ, 23 బీఈడీ, 7 ఎంబీఏ, ఒక ఎంఈడీ, ఒక బీపీఈడీ, ఒక లా కాలేజీలు తదితరాలు ఉన్నాయి. ఇటీవల వర్సిటీకి అదనంగా లా, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా మంజూరయ్యాయి. ఇంతటి ప్రతిష్టాత్మక వర్సిటీలో ఇలాంటి విపరీత ధోరణి ఇదే తొలిసారి అని పలువురు వాపోతున్నారు.

చిట్టీల రాయుళ్లు!