
పునర్విభజన గందరగోళం
● ముసాయిదాపై పలువురి అసంతృప్తి ● ఓటర్ల గల్లంతుపై అయోమయం ● రామగుండం బల్దియాలో డివిజన్ల పెంపుపై సర్వత్రా చర్చ
కోల్సిటీ (రామగుండం): ఎనిమిది గ్రామ పంచాయతీల విలీనంతో 1982లో నోటిఫైడ్ ఏరియాగా అవతరించిన రామగుండం.. 1995లో 34 వార్డులతో మున్సిపాలిటీగా మారింది. 2010లో యాబై డివిజన్లతో మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం 60 డివిజన్లతో రాష్ట్రంలోని ప్రముఖ నగరాల సరసన చేరింది.
1982 నుంచి 93.87 చ.కి.మీ. వైశాల్యమే..
రామగుండం నగరం 1982 నుంచి 93.87 చ.కి.మీ.వైశాల్యానికే పరిమితమైంది. ప్రస్తుతం లింగాపూర్, వెంకట్రావుపల్లి, ఎల్కలపల్లిగేట్, అక్బర్నగర్ గ్రామాల విలీనంతో నగర విస్తీర్ణం 99.5 చ.కి.మీ.లకు విస్తరించింది. తాజాగా రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటన నేపథ్యంలో అభివృద్ధి పుంజుకుంటుందని నగరవాసులు భావిస్తున్నారు. తాజాగా 60 డివిజన్ల విభజనతో 1,84,427 ఓట్లర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మున్సిపల్గా ఏర్పడిన 1995లో దాదాపు ఒక లక్షా 40 వేల మంది ఓటర్లు ఉండగా, 30ఏళ్ల అనంతరం కొన్ని గ్రామాల విలీనం చేశాక కూడా కేవలం 40 వేల మంది ఓటర్లే పెరగడం గమనార్హం.
కొందరికి మోదం.. ఇంకొందరికి ఖేదం..
నగరంలో డివిజన్ల పెంపు కొందరికి మోదం కలిగించగా, మరికొంతదరికి ఖేదం కలిగించినట్లయ్యింది. ఈసారి కార్పొరేటర్లుగా పోటీ చేద్దామనుకునే మాజీ లు తమ డివిజన్ హద్దులు మారడంతో కంగుతి న్నారు. అభివృద్ధి పనులు చేపట్టిన ప్రాంతాలు పొరుగు డివిజన్లలో కలవడంతో ఓటుబ్యాంక్ కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. కొత్త ఆశావహులకు కొంత కలిసి వచ్చింది. గతంతో పోల్చితే.. ఓట్ల సంఖ్య తగ్గడంతో విజయం సులభమవుతుందని మరికొందరు భావిస్తున్నారు. ఏదేమైనా డివిజన్ల పునర్విభజన ముసాయిదా స్తబ్ధుగా ఉన్న రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేపింది. సంఖ్య పెంపు, ఒక్కో డివిజన్ రెండు ముక్కలు కావడం, సమీప డివిజ్లోనైనా రిజర్వేషన్ కలిసివస్తుందని కొందరు సంతోష పడుతున్నారు. బీసీల రిజర్వేషన్ కోటా 42 శాతం అమలైతే దాదాపుగా 25 సీట్లు వారి కోటాలోకే వెళ్తాయంటున్నారు. 50శాతం సీట్లు.. అంటే 30 సీట్లు మహిళలకు దక్కనున్నాయి. మరోవైపు.. ప్రతీ విభజన సమయంలో మేయర్ స్థానం ఎస్సీ కోటాలోకే వెళ్తోంది. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగుతుందని కొందరు భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ సౌకర్యం పెరిగిన నేపథ్యంలో ఈసారి బీసీలకు ఆ స్థానం దక్కుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
గందరగోళంగా ముసాయిదా..
డివిజన్ల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్ గందరగోళంగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. చాలామంది ఓటర్లను లెక్కించకుండానే మొక్కుబడిగా ముసాయిదా తయారు చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని డివిజన్లలోని ఓటర్లను పరిగణనలోకి తీసుకోకుండా, పార్ట్ అని పొందుపరచడం అయోమయానికి దారితీస్తోంది. ఓటరు జాబితా పొంతన లేకుండా ఉందంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమిషనర్కు వినతి పత్రాలను సమర్పించారు.

పునర్విభజన గందరగోళం