
పని ఒత్తిడి.. ఆర్థిక భారం
పంచాయతీ పాలకవర్గాలు లేక కార్యదర్శులు అన్నీతామై పనులు చక్కబెడుతున్నారు. ఒకవైపు ప్రజాప్రతినిధులుగా, మరోవైపు ప్రభుత్వ సారథులుగా ఒకేసమయంలో రెండు విధులూ నిర్వర్తిస్తున్నారు. ఫలితంగా పనిఒత్తిడితోపాటు ఆర్థికంగా సతమతమవుతున్నారు. అయినా, వీరిగోస పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన చెందుతున్నారు.
సెలవుల్లోనూ విధులు
ప్రభుత్వం చేపట్టిన సంక్షే మ పథకాలను విజయవంతం చేయడానికి రాత్రింబవళ్లు పనిచేస్తున్నాం. సెల వు రోజులు, పండుగ సమయాల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నాం. కుటుంబాలకు దూరంగా ఉంటున్నాం. మా శాఖకు సంబంధం లేనిపనులు కూడా అప్పగించడంతో పనిభారం పెరుగుతోంది.
– ఎడిపల్లి సంతోష్, కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి
నిధులు నిలిచిపోయాయి
గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేవు. ఫలితంగా వివిధ రూపాల్లో రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. అత్యవసర పనులు చేయలేక కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– వీరబుచ్చయ్య, డీపీవో
●
రామగిరి(మంథని): గతేడాది ఫిబ్రవరిలో గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసింది. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఆ భారం కూడా పంచా యతీ కార్యదర్శులే మోయాల్సి వస్తోంది. రోజూ వారి విధులతోపాటు సర్వేలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా తయారీ, వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇతరత్రా సమస్యల పరిష్కారం, వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం తలకు మించిన భారంగా మారుతోంది.
జిల్లాలో 266 పంచాయతీలు..
జిల్లాలో 266 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి ఒకటిన పంచాయతీ పాలకవర్గా ల గడువు ముగిసింది. ప్రభుత్వం మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. సర్పంచుల స్థానంలో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. అయితే, నిధులు లేకపోవడంతో వీధిదీపాలు, పారిశుధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి పరిష్కారానికి పంచాయతీ కార్యదర్శులు సొంతంగా నిధులు సమకూర్చుకుంటున్నారు. ఉదయం 9 గంటల్లోపే గ్రామాలకు చేరుకుని లైవ్ లోకేషన్ ద్వారా వారి ఫొటోలను ఆన్లైన్ అప్లోడ్ చేస్తున్నారు. ఏమాత్రం సమయం మించిపోయినా అధికారుల చీవాట్లు తప్పడంలేదు.
తప్పని రాజకీయ నాయకుల ఒత్తిళ్లు..
పనిభారంతో సతమతమవుతున్న పంచాయతీ కార్యదర్శులపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ రకాలుగా ఒత్తిళ్లు చేస్తున్నారు. ప్రధానంగా కొందరు మాజీప్రజాప్రతినిధులు ఇప్పటికీ తాము అధికారంలో ఉన్నామనే భావనతో ఆస్తిప న్ను, నీటిబిల్లులు, లైసెన్స్ ఫీజు వసూలు చేయాలని తరచూ ఒత్తిడి చేస్తున్నారు. పన్నులు, బిల్లుల వసూళ్లలో నిర్దేశిత లక్ష్యం చేరుకోక అటు ఉన్నతాధికారుల నుంచి కూడా వారు చీవాట్లు పడుతుండగా, నాయకుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో కొందరు మనస్తాపానికి గురవుతున్నారు.
మరమ్మతులకు సొంత డబ్బులు..
గ్రామాల్లో వాటర్పైప్లైన్ల లీకేజీల మరమ్మతు, పంచాయతీ ట్రాక్టర్ నెలవారీ బ్యాంక్ కిస్తీలు, విద్యుత్ దీపాల ఏర్పాటు, బ్యాంక్ ఇన్స్టాల్మెంట్, విద్యుత్ బిల్లుల చెల్లింపులు కూడా పంచా యతీ కార్యదర్శులు తమ జేబుల్లోంచి చెల్లిస్తున్నారు. ఇలా ఇప్పటికే ఒక్కో పంచాయతీ కార్యదర్శి సుమారు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వివిధ పనులకు వెచ్చించారని సమాచారం.
డిపార్ట్మెంట్కు సంబంధం లేని పనులు
గతంలో కార్యదర్శులు గ్రామ పంచాయతీ విధులే నిర్వర్తించేవారు. ఆస్తిపన్ను వసూలు, పంచాయతీ ఆదాయవ్యయాల నిర్వహణ, జనన, మరణ ధ్రువీ కరణ పత్రాల జారీ, ఇంటి నిర్మాణ అనుమతుల మంజూరు, పాలకవర్గా సమావేశాల తీర్మానాలు, పారిశుధ్య నిర్వహణ లాంటి పనులను చేసేవారు. ఇప్పుడు అదనంగా ప్రకృతి వనాలు, శ్మశానవాటిక, క్రీడా ప్రాంగణాల నిర్వహణ తదితర పనులు చేయాల్సి వస్తోంది. అంతేకాదు.. కులగణన, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, భూముల సర్వే తదితర పనులకూ అధికారులు పురమాయిస్తున్నారు. అసలు తమ శాఖకు సంబంధం లేని పనులు చేయాల్సి రావడంతో పంచాయతీ కార్యదర్శులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
సతమతమవుతున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు
తమ గోస పట్టించుకునే వారు లేరంటూ పలువురి ఆవేదన

పని ఒత్తిడి.. ఆర్థిక భారం

పని ఒత్తిడి.. ఆర్థిక భారం

పని ఒత్తిడి.. ఆర్థిక భారం