
ఆగని మట్టి లొల్లి
పెద్దపల్లిరూరల్: ఇటుకల తయారీకి అవసరమయ్యే చెరువు మట్టి లొల్లికి ముగింపు లభించడంలేదు. రూ.కోట్ల విలువచేసే మట్టి తవ్వకాలు, తరలింపుల్లో అనుమతుల విషయంపై మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల పాత్ర ప్రధానంగా ఉంటుండగా.. తాజాగా పోలీసులు రంగప్రవేశం చేయడం సమస్యను మరింత జటిలం చేసిందంటున్నారు. పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని చెరువు నుంచి మూడేళ్ల క్రితం తవ్వితీసిన మట్టిని అదే ప్రాంతంలోని రైతుల వ్యవసాయ భూముల్లో గుట్టలుగా పోసి నిల్వ చేశారు. ఇప్పుడు ఆ చెరువులో నుంచి కాకుండా గుట్టలుగా పోసిన కుప్పల్లోంచి మట్టిని తరలించుకు పోయేందుకు వాటికి సంబంధించిన ఇటుకబట్టీ యజమానులు రవాణా ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అయితే, మట్టికుప్పులకు జరిమానా చెల్లించి తీసుకెళ్లాలని మైనింగ్ అధికారులు సూచించారు. వారి సూచనమేరకు నాలుగు ఇటుక బట్టీలకు చెందిన నిర్వాహకులు ఇటీవల జరిమానా చెల్లించారు. అందులో ముగ్గురు మట్టిని ఇప్పటికే తరలించుకుపోయారు.
మట్టికుప్పల కోసం గొడవ..
పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట శివారులోని ఇటుకబట్టీ యజమానులు జరిమానా చెల్లించి మట్టిని టిప్పర్లలో తరలిస్తుండగా ఆ మట్టి తమదంటూ సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన ఇటుక బట్టీ యజమానులు రంగప్రవేశం చేశారు. అయితే మైనింగ్ అధికారులకు తాము జరిమానా చెల్లించి మట్టిని తీసుకెళ్తున్నామని గౌరెడ్డిపేటకు చెందిన ఇటుకబట్టీ వ్యాపారులు పేర్కొంటున్నారు. తమకు చెందిన మట్టి కుప్పనే సంబంధం లేనివారు తరలించుకుపోతున్నారని సుల్తానాబాద్కు చెందిన వ్యాపారులు ఆరోపిస్తున్నారు. వారికి మద్దతుగా పోలీసులు రంగప్రవేశం చేసి టిప్పర్లు, జేసీబీల తాళాలను లాక్కెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. రాజకీయ నాయకుల అండ సుల్తానాబాద్ వ్యాపారులకు ఉండడంతోనే పోలీసులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గౌరెడ్డిపేటకు చెందిన ఇటుకబట్టీ యజమానులు పేర్కొంటున్నారు. చెరువుమట్టి తరలింపుపై తలెత్తిన వివాదాన్ని పరిష్కరించాల్సిన మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు.. తమకు పట్టీపట్టనట్టుగా వ్యవహరించడంతోనే మట్టిలొల్లి కొనసాగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తపల్లి శివారులో నిల్వ ఉంచిన కోట్లాది రూపాయల చెరువు మట్టి వ్యవహారంపై కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
మైనింగ్ అధికారుల దృష్టికి సమస్య..
చెరువు మట్టి విషయంలో ఇటుక బట్టీల నిర్వాహకుల మధ్య వివాదం తలెత్తిందని, ఈక్రమంలో తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై లక్ష్మణ్రావు తెలిపారు. ఈ విషయాన్ని మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని వారికి సూచించామని ఆయన తెలిపారు.
అనుమతి ఉన్నా పోలీసుల ఆటంకాలు
ఆవేదనలో ఇటుక బట్టీ యజమానులు

ఆగని మట్టి లొల్లి