
ముంపు ముప్పు?
● లోతట్టు ప్రాంతాల్లో కానరాని ప్రత్యామ్నాయ చర్యలు ● భారీ వర్షాలు కురిస్తే మళ్లీ నీటమునిగే ప్రమాదం ● కాళేశ్వరం గేట్లు ఎత్తినా గోదావరిలో నీటి నిల్వలకు అవకాశం
గోదావరిఖని: రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు రామగుండం నియోజకవర్గంలోని అనేక ప్రాంతా లు బ్యాక్వాటర్లో మునిగాపోయాయి. నివాసాల్లోకి వరద చొచ్చుకు వచ్చి నిత్యావసరాలు, వస్తుసామగ్రి తడిసి ముద్దయ్యాయి. తినేందుకు తిండిలేక, తలదాచుకునేందుకు ప్రత్యామ్నాయాలు లేక అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మళ్లీ వర్షాకాలం సమీపించడంతో బాధితులు జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు. ఈసారి లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.
గేట్లు ఎత్తినా వరదతో ముప్పే..
కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన పార్వతీ బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినా.. ఎగువ నుంచి గోదావరి నదికి భారీగా వరద వస్తే.. ఆయా ప్రాంతాల్లోంచి విడుదలయ్యే డ్రైనేజీలు వెనక్కి మళ్లిపోతాయి. తద్వారా లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలు నీటమునుగుతాయి. రెండేళ్లక్రితం పార్వతీ బ్యారేజీ గేట్లు మూసినా.. ఎగువన కురిసిన భారీ వర్షాలకు గోదావరిఖని ప్రాంతంలోని మల్కాపూర్, సప్తగిరికాలనీ, ప్రశాంత్నగర్, రెడ్డికాలనీ, గంగానగర్, రఘుపతిరావునగర్, ఎన్టీపీసీ మేడిపల్లి, మ ల్కాపూర్లోని సుమారు 10వేల కుటుంబాలు వరదనీటితో ఇరుక్కుని ఇబ్బంది పడ్డాయి. ఇళ్లలోకి నీ ళ్లు రావడంతో చాలామంది నిరాశ్రయులయ్యారు.
సరికొత్తసమస్య..
కాళేశ్వరం నిర్మాణంతో పారిశ్రామిక ప్రాంతానికి కొ త్త సమస్య ఎదురైంది. భారీ వర్షాలకు గోదావరిలో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. బ్యాక్ వాటర్తో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. పంటలు, నివాసాలు నీటమునిగి ఒక్కో కుటుంబం రూ.లక్షల్లో నష్టపోతోంది. ఈసారి కాళేశ్వరం గేట్లు ఎత్తివేసినా.. ఆదిలాబాద్ జిల్లాలో కురిసే భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతుందని అంచనా వేస్తున్నారు. అందులో కలిసే మురుగునీరు వెనక్కి వచ్చి జనావాసాలను ముంచెత్తే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సుమారు 30 ఏళ్ల క్రితం వచ్చిన వరదలతో గోదావరి ఉప్పొంగి పవర్హౌస్కాలనీ, గంగానగర్ వరకు నీళ్లు వచ్చి చేరాయి. మంచిర్యాల – గోదావరిఖని మధ్య రాకపోకలు స్తంభించాయి.
గోదావరి తీరం వెంట కరకట్ట లేక..
కాళేశ్వరం బ్యాక్వాటర్ ముంపు ముప్పు తప్పించేందుకు సిరిపురం వద్ద నిర్మించిన బ్యారేజీ నుంచి గోదావరి వెంట సుమారు 5 కి.మీ. పొడవున సుందిళ్ల వరకు కరకట్ట, వరద వెళ్లేందుకు డైవర్షన్ నాళా నిర్మించారు. అయితే, మరో 5 కి.మీ. పొడవున కరకట్ట నిర్మిస్తే పారిశ్రామిక ప్రాంతానికి వరద ముప్పు తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు.
ముప్పు ఉందని ముందే గుర్తించినా..
కాళేశ్వరం నిర్మాణంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని భావించిన అధికారులు.. ముంపు గ్రామాలను గుర్తించలేదు. ప్రణాళిక ప్రకారం సముద్రమట్టానికి 132 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించాలని డిజైన్ చేసినా, దాన్నిమార్పు చేసి 138 మీటర్లకు పెంచారు. దిగువకు 8లక్షల క్యూసెక్కుల వదరను విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు క్యూసెక్కుల వ రద పోటెత్తగా.. దానిని విడుదల చేయాల్సి వచ్చింది. అంత సామర్థ్యం లేక గోదావరినదికి ఇరువైపులా వరద పోటెత్తి లోతట్టుప్రాంతాలను ముంచెత్తింది. గోదావరిఖని గంగానగర్ సమీపంలో రాజీవ్ రహదారి పైనుంచి వరద ప్రవహించింది.
సమ్మక్క గద్దెల వద్ద కరకట్ట
గోదావరి తీరంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద బ్యాక్వాటర్ ముంపు ముప్పును అధిగమించేందుకు సింగరేణి రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రధానంగా సమ్మక్క గద్దెలతోపాటు గోదావరి తీరం, గోదావరి బ్రిడ్జి నుంచి పంప్హౌస్ వరకు మట్టిపోయాలని నిర్ణయించారు.

ముంపు ముప్పు?

ముంపు ముప్పు?