బియ్యం పంపిణీకి ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

బియ్యం పంపిణీకి ఏర్పాట్లు

May 29 2025 1:05 AM | Updated on May 29 2025 9:49 AM

బియ్య

బియ్యం పంపిణీకి ఏర్పాట్లు

● మూడు నెలల స్టాక్‌ ఒకేసారి ● గోదాముల నుంచి గ్రామాలకు.. ● సరఫరా చేస్తున్న అధికారులు ● జూన్‌ మొదటివారంలో పంపిణీ

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): కేంద్రప్రభుత్వం ఆదేశానుసారం లబ్ధిదారులకు మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ చేసేందుకు జిల్లా పౌర సరఫరాల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలంలో రవాణా వ్యవస్థ స్తంభిస్తే పేదలకు బియ్యం అందకుండా పోతాయని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా జూన్‌, జూలై, ఆగస్టు కోటాను జూన్‌లో ఒకేసారి ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో రేషన్‌ బియ్యం పంపిణీకి పౌర సరఫరాల అధికారులు శ్రీకారం చుట్టారు.

డీఎస్‌వో పర్యవేక్షణలో..

మూడు నెలల స్టాక్‌తోపాటు వాహనాలు, బియ్యం సరఫరా ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా పౌర సరఫరాల అధికారి(డీఎస్‌వో) రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించారు. గతంలో పంపిణీ చేసిన దొడ్డుబియ్యం నాసిరకంగా ఉండడంతో చాలామంది లబ్ధిదారులు తినడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తుండడంతో పేదలు అందరూ తీసుకెళ్తున్నారు. తద్వారా వారిపై నిత్యావసరాల భారం తగ్గుతోంది.

జిల్లాలో 413 రేషన్‌ దుకాణాలు..

జిల్లావ్యాప్తంగా మొత్తం 413 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటికి పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ లోని గోదాముల నుంచి బియ్యం సరఫరా చేస్తున్నా రు. జిల్లాలోని లబ్ధిదారులకు ప్రతీనెల సుమారు 3 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం కోటా విడుదల చేస్తారు. ఈలెక్కన ఈసారి మూడు నెలలకు సుమా రు 12వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమని అధికారులు అంచనా వేశారు. అయితే, రేషన్‌ డీలర్ల వద్ద మూడు నెలల స్టాక్‌ నిల్వ చేసేందుకు సౌకర్యం ఉందా? లేదా? అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. సౌకర్యాలు లేనివారు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.

జూన్‌ మొదటివారంలో పంపిణీ..

రాష్ట్రప్రభుత్వం రెండు నెలల నుంచి కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. మే నెల కోటా పంపిణీ పూర్తయ్యింది. దీంతో జూన్‌, జూలై, ఆగస్టు కోటాను జూన్‌ మొదటి వారంలో ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు.. జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జిల్లాకు మంజూరైన మరో 4,467 కొత్త రేషన్‌ కార్డులు లబ్ధిదా రులకు అందజేస్తారు. వీటిపై కూడా బియ్యం పంపిణీ చేసేందుకు కోటా విడుదల చేస్తున్నారు.

ఏర్పాట్లు చేయాలి

లబ్ధిదారులకు మూడునెలల రేషన్‌ బియ్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు బయోమెట్రిక్‌ తప్పనిసరి అవసరం. అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలి. బయోమెట్రిక్‌లో ఆటంకాలు ఎదురైతే లబ్ధిదారులతో గొడవలు జరిగే ప్రమాదం ఉంది.

– కొమురయ్య, డీలర్‌, సుల్తానాబాద్‌

సరిపడా సరఫరా

మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని డీలర్లకు సరఫరా చేస్తున్నాం. లబ్ధిదారులకు సరిపడా బియ్యం నిల్వలు అందుబాటులోనే ఉన్నాయి. గ్రామాల వారీగా రేషన్‌ షాపులకు సరఫరా చేస్తున్నాం. బయోమెట్రిక్‌లో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తాం.

– రాజేందర్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి

బియ్యం పంపిణీకి ఏర్పాట్లు1
1/2

బియ్యం పంపిణీకి ఏర్పాట్లు

బియ్యం పంపిణీకి ఏర్పాట్లు2
2/2

బియ్యం పంపిణీకి ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement