● జోరుగా భవనాలు, షాపుల కూల్చివేత ● రామగుండం నగరంలో తెరుచుకుంటున్న కొత్తదారులు ● దశాబ్దాల తర్వాత వేగంగా రహదారుల అభివృద్ధి ● ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్లకూ అంకురార్పణ ● మరో 50ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ప్రగతి పనులు ● హైవేపై ప్రమాదాల నియంత్రణకు సర్వీస్ రోడ్ల నిర్మాణం
గోదావరిఖని: జిల్లాలోనే ఏకై క నగరం రామగుండం. పారిశ్రామిక ప్రాంతంగా ప్రఖ్యాతిగాంచిన నగరంలో గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, రామగుండం పట్టణాలు ఉన్నాయి. అయితే, ప్రధాన ప్రాంతా ల్లో ఇరుకైన రోడ్లు నగరవాసులకు చుక్కలు చూపెడుతున్నాయి. వాటి విస్తరణకు పలుపర్యాయాలు ప్రయత్నాలు జరిగినా.. భవనాలు, నివాసాలు అవరోధం కలిగిస్తూ వస్తున్నాయి. వాటిని తొలగించేందుకు యత్నిస్తే రాజకీయ ఒత్తిళ్లు ఆటంకం కలిగిస్తున్నాయి. వీటన్నింటినీ అధిగమించడం అధికారులకు సవాల్గా మారుతోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, స్థానిక ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం, సింగరేణితోపాటు ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ తదితర పరిశ్రమలు సహకరించడంతో నగరం ఆధునికత సంతరించుకుంటోంది.
సినిమా టాకీస్ కూల్చివేతతో శ్రీకారం..
నగరం నడిబొడ్డున ఉన్న ఓ సినిమా టాకీస్ కూల్చివేతతో రోడ్ల విస్తరణకు తొలిఅడుగు పడింది. ప్రస్తుతం బీ – పవర్హౌస్గడ్డ నుంచి గోదావరి నది సమీపంలోని గంగానగర్ ప్లైఓవర్ వరకు సర్వీస్ రోడ్ల విస్తరణపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే రాజీవ్ రహదారి వెంట సర్వీ సు రోడ్ల నిర్మాణం వేగవంతమైంది. వీటికి అడ్డుగా ఉన్న భవనాల కూల్చివేతలకు తొలుత వ్యతిరేకత ఎదురైనా.. అదేస్థాయిలో రోడ్ల విస్తరణ, ఆధునిక వ్యాపార సముదాయాల నిర్మాణం, నగర అభివృద్ధికి అడుగులు పడుతుండడంతో ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది.
ప్రమాదాలకు నిలయం..
స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రాజీవ్ రహదారి పక్కనే ఉన్న భవనం సర్వీసు రోడ్డు విస్తరణకు అవరోధంగా మారింది. అంతేకాదు.. రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బస్టాండ్లోకి వెళ్లడం, ఆటోలు కూడా చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. సర్వీసు రోడ్ల విస్తరణపై దృష్టి సారించిన ఎమ్మెల్యే రాజ్ఠాకూర్.. బస్టాండ్ సమీపంలో కూడా రోడ్డు విస్తరించాలని సూచించారు. దీంతో ఆ భవనాన్ని ఇటీవల కూల్చివేశారు. అదే విధంగా వ్యాపార కేంద్రమైన కల్యాణ్నగర్లోనూ రోడ్ల విస్తరణ జోరందుకుంది. మార్కండేయకాలనీలో రోడ్డు విస్తరణకు అవరోధంగా ఉన్న రాజేశ్ థియేటర్ వెనకాల ఉన్న ఓ భవనాన్ని కూడా శనివారం బల్దియా అధికారులు కూల్చివేశారు. ఈభవనం కూల్చివేతతో రోడ్డు విస్తరణ వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు.
50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా పనులు
మరో 50 ఏళ్లవరకు అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా రోడ్లు విస్తరించాలి. ఆధునిక భవనాలు, షాపింగ్కాంప్లెక్స్ నిర్మించాలి. అందుకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. ఈ పనులతో కొందరికి ఇబ్బందులు ఎదురైనా చాలామందికి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఇందు కోసం రాజీలేకుండా ముందుకు సాగుతాం.
– ఎంఎస్ రాజ్ఠాకూర్, రామగుండం ఎమ్మెల్యే
విస్తరణకు అడుగులు
విస్తరణకు అడుగులు
విస్తరణకు అడుగులు