
వర్షాకాలం.. అప్రమత్తత అవసరం
● విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలి ● ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ మాధవరావు
జ్యోతినగర్(రామగుండం): వర్షాకా లం ప్రారంభమైంది. ఈ కాలంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా విద్యత్ ప్రమాదాలు జరుగుతాయి. అందుకే అత్యంత జాగ్రత్తగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ సర్కిల్ సూపరింటెండెంట్ కె.మాధవరావు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు, రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆయన సూచనలు ఇవీ..
● వినియోగదారులు విద్యుత్ సంబంధిత పనులు సొంతంగా చేసుకోవద్దు.
● తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా ఉన్న, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు. వీటిని గమనించిన వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1912 ద్వారా విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.
● ఇళ్లలో బట్టలు ఆరవేసే జీఐ దండెం/వైర్లకు ఇన్సులేషన్ సరిగ్గా లేకుంటే విద్యుత్ సరఫరా అయ్యి షాక్ గురయ్యే ప్రమాదం ఉంది. వీటికోసం ప్లాస్టిక్ దండేలు ఉపయోగించాలి.
● స్తంభం నుంచి విద్యుత్ సరఫరా అయ్యే తీగలను ఇంటి ఎదుట రేకులకు తాకకుండా చూడాలి.
● విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల వద్దకు పశువులు వెళ్లకుండా కాపరులు అప్రమత్తంగా ఉండాలి. కిందపడిన కరెంట్ వైర్లను గమనించాలి.
● ఇంటి వైరింగ్కు ఎర్తింగ్ చేయాలి. నాణ్యమైన ప్లగ్గులు, సెల్ఫోన్ చార్జర్లు ఉపయోగించాలి.
● సెల్ఫోన్ చార్జింగ్ పెట్టి తడిచేతులతో తాకరాదు.
● కరెంట్ షాక్ సంభవిస్తే సమీపంలోని వ్యక్తులు రక్షించే సమయంలో నేరుగా ముట్టుకోరాదు. కర్ర, ప్లాస్టిక్ వస్తువులతో తీగ నుంచి బాధితుడిని వేరుచేయాలి.
● రైతులు నాణ్యతమైన వ్యవసాయ పంపుపెట్లు వినియోగించాలి.
● వ్యవసాయ పంపుసెట్లు, ఫుట్ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్ కచ్చితంగా ఉండేలా చూడాలి. పంపుసెట్లను, స్టార్టర్లను ఎర్త్ చేయాలి. ఎర్త్ చేయనివి తాకితే ప్రమాదం బారినపడతారు.
● విద్యుత్ సంబంధిత పనులన్నీ స్వయంగా కాకుండా ఎలక్ట్రీషియన్తోనే చేయించాలి.
● విద్యుత్ కంచెలతో రైతులు ప్రమాదాలకు గురవుతున్నారు.
● వీటిని ఏర్పాటు చేస్తే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి.
● విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజులు మార్చడం, రిపేరు చేయడం, ఏబీ స్విచ్లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం. ఇవి కేవలం విద్యుత్ సిబ్బంది మాత్రమే చేస్తారు. ఇతరులెవరూ చేయరాదు.
● గ్రామీణ వినియోగదారులు లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇంజినీర్, సెక్షన్ అధికారులను సంప్రదించి విద్యుత్ సేవలు పొందాలి.