
ఆరబోతకు అష్టకష్టాలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో వరి పండించిన రైతులు.. వడ్లను ఆరబోసేందుకు కల్లాలు లేక అష్టకష్టాలు ప డుతున్నారు. ఈసారి యాసంగిలో సుమారు 1.98 లక్షల ఎకరాల్లో వరి సాగైందని అంచనా. దాదాపు 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
మూడేళ్లుగా కల్లాల పనుల్లేవ్..
జిల్లాలో 2021–22 ఆర్థిక సంవత్సరం వరకు ధాన్యం ఆరబోసేందుకు ఉపాధిహామీ ద్వారా కల్లాలు నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అవసరమైన మెటీరియల్ పనులకు అనుమతి ఇవ్వబోమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేయడంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. అప్పటికే జిల్లాలో 2,073 పనులకు అనుమతి వచ్చినా.. 139 పనులే ప్రారంభించారు. అందులోనూ 56 పనులే పూర్తయినట్లు సమాచారం. కల్లాల నిర్మాణంతో తాము స్థలం కోల్పోవాల్సి వస్తుందని రైతులు భావించడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు.
మెయిన్ రోడ్లపై ధాన్యం..
రైతులు సమీపంలోని మెయిన్రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. వాహనదారులు ఆ కుప్పలను గ మనించక ప్రమాదాలబారిన పడే అవకాశాలు ఉ న్నాయి. నాణ్యమైన వడ్లు తేవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిబంధన విధించడంతో ఇలా ఆరబోయాల్సి వస్తోందని రైతులు అంటున్నారు.
అంతటా ఉత్కంఠ..
వరి పంట చేతికి అందే దశలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేశాయి. దాదాపు 1,035 మంది రైతులు సుమారు 1,514 ఎకరాల్లో వరి పంట నష్టపోయారని వ్యవసాయాధికారుల సర్వేలో తేలింది. మొక్కజొన్నకు 1,084 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ప్రస్తుతం వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ సమయంలో ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం రైతులను కలవరపెడుతోంది. అందుకే వీలైనంత త్వరగా వడ్లను విక్రయించాలనే ఆలోచనలతో ప్రమాదమని తెలిసినా.. రోడ్లపై వడ్లు ఆరబోస్తున్నామని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
వడ్లు ఆరబోసేందుకు కల్లాలు లేక అన్నదాతకు తిప్పలు ప్రధాన రహదారులు.. లేదంటే పొలాలే దిక్కు తేమశాతం కోసం రైతులకు తప్పని అగచాట్లు వెనువెంటనే రైస్మిల్లర్లకు విక్రయిస్తున్న మరికొందరు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు గోపమ్మ. పెద్దపల్లి మండలం నిట్టూరు స్వగ్రామం. తాను పండించిన వడ్లను ఆరబోసేందుకు తగిన స్థలంలేదు. దీంతో పొలం మడుల్లోనే ధాన్యం ఆర బోసింది.
పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట నుంచి కాసులపల్లికి
వెళ్లే మెయిన్ రోడ్డు ఇది. కాసులపల్లి గ్రామ రైతులు పండించిన వడ్లను రోడ్డుపై ఇలా ఆరబోస్తున్నారు. రేయింబవళ్లు కాపలా కాయడం కష్టంగానే ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి మండలం గోపయ్యపల్లిలో రోడ్డుపై రైతులు ఆరబోసిన ధాన్యం ఇది. ఈ ధాన్యాన్ని గుర్తించకుండా వాహనదారులు ముందుకు వెళ్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అయినా, గత్యంతరం లేక ఇలా ఆరబోయాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు.
‘యాసంగి ధాన్యం చేతికి వస్తోంది. కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ, నిర్దేశిత తేమశాతం వచ్చేందుకు వడ్లు ఆరబోయాలంటే అన్నదాతలకు స్థలం లభించడంలేదు. దీంతో కొందరు రోడ్లపై, మరికొందరు పొలాల్లో ఆరబోస్తున్నారు. ఇంకా కొందరు పంట కోసిన వెంటనే రైస్మిల్లరుకు విక్రయిస్తున్నారు’ అని కాసులపల్లికి చెందిన రైతు తిరుపతిరెడ్డి వాపోయాడు.

ఆరబోతకు అష్టకష్టాలు

ఆరబోతకు అష్టకష్టాలు

ఆరబోతకు అష్టకష్టాలు