
సింగరేణిలో ప్రీ ఫ్యాబ్రికేషన్ చెక్పోస్టులు
● యువ ఉద్యోగుల నియామకానికి చర్యలు ● రిటైర్డ్ సెక్యూరిటీ సిబ్బంది స్థానంలో యువతతో భర్తీ ● సంస్థ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం ● అంతర్గత ఉద్యోగులకే అవకాశం
గోదావరిఖని: సింగరేణి సంస్థ ఆస్తులను కంటికి రెప్పలా కాపాడే సెక్యూరిటీ విభాగం బలోపేతంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహించే ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలతో కూడిన ప్రీఫ్యాబ్రికేషన్ చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సంఖ్య పెరిగిపోవడం, ప్రతీనెల పర్మినెంట్ సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగ విరమణ పొందుతుండటంతో చాలాఏరియాల్లో ఖాళీలు అధికంగా ఏర్పడుతున్నాయి. ఇదేస్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీతో సమానంగా పర్మినెంట్ సెక్యూరిటీ సిబ్బంది ఉండాలనే నిబంధన ప్రకారం యువ ఉద్యోగులను నియమించాలని భావిస్తోంది. త్వరలో సెక్యూరిటీ విభాగంలో అంతర్గతంగా యువ ఉద్యోగులను నియమిస్తుందని అంటున్నారు.
పదోన్నతులకు శ్రీకారం..
సింగరేణిలో సీనియర్ సెక్యూరిటీ సిబ్బందికి పదోన్నతి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. వారికి అన్ని పరీక్షలు నిర్వహించిన సింగరేణి యాజమాన్యం.. 26 మందిని సెక్యూరిటీ జమేదార్లుగా ఎంపిక చేసింది. వీరికి వెబ్కౌన్సెలింగ్ ద్వారా సెక్యూరిటీ పోస్టులను ఖరారు చేయనుంది. జమేదార్ నుంచి జూనియర్ ఇన్స్పెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు నిర్ణయించింది. సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఇలా 12 మందిని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆధునిక డిజైన్లలో నిర్మాణం..
పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే లా రూపొందించిన ప్రీ ఫ్యాబ్రికేషన్ చెక్పోస్టుల ను తయారు చేయించడంపై సింగరేణి యాజమాన్యం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీటిలో ఇప్పటికే కొన్నినిర్మాణం పూర్తికాగా ఇంకా 56 ప్రీ ప్యాబ్రికేషన్ చెక్పోస్టులను త్వరలో పూర్తిచేయించి ఏరియాలకు పంపించనున్నారు. క్యాబిన్, టేబుల్, రెండు చెయిర్స్, ఫాల్సీలింగ్తో ఆధునిక డిజైన్లలో వీటిని నిర్మిస్తున్నారు.