సమన్వయంతోనే పోషకాహార లోపం నివారణ
పార్వతీపురం రూరల్: చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు వైద్య, ఐసీడీఎస్ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎస్.భాస్కరరావు సూచించారు. శుక్రవారం స్థానిక ఎన్జీఓ హోంలో వైద్యాధికారులకు నిర్వహించిన ’కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్’ (సి.ఎం.ఎ.ఎమ్) శిక్షణలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో లోపం ఉన్న పిల్లలను గుర్తించి, ఆరోగ్య పరిస్థితిని బట్టి కమ్యూనిటీ స్థాయిలో లేదా ఎన్ఆర్సీ ద్వారా సేవలు అందించాలని స్పష్టం చేశారు. టాటా ట్రస్ట్, విజయవాహిని ఫౌండేషన్ ప్రతినిధులు శిక్షణ అందించగా..ఇప్పటికే ఐసీడీఎస్ సిబ్బందికి అవగాహన పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు విజయమోహన్, పద్మావతి, జగన్మోహనరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


