
కూటమి కపట నాటకం!
కౌలు
రైతులపై...
పార్వతీపురం రూరల్: ఎన్నికల ముందు ఓట్ల కోసం కల్లబొల్లి కబుర్లు చెప్పడం.. గద్దెనెక్కిన తర్వాత హామీలను గాలికొదిలేయడం కూటమి పాలకులకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. అందరికీ అన్నం పెట్టే రైతన్న కడుపు మాడుతున్నా... ఈ సర్కార్కు చీమ కుట్టినట్టయినా లేదు. ముఖ్యంగా సాగు భూమిలో సింహభాగం వాటా కలిగిన కౌలు రైతుల కష్టాలు అరణ్యరోదనగా మారుతున్నాయి. ఖరీఫ్ పంట చేతికొచ్చే దశకు చేరుకుంటున్నా, వారికి ఇస్తామన్న అన్నదాత సుఖీభవ సాయం అందకపోవడం కూటమి సర్కార్ నిర్లక్ష్యానికి, రైతులపై చూపిస్తున్న వివక్షకు నిలువుటద్దం పడుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో కౌలు రైతుల కన్నీటి గాథలే ఇందుకు సజీవ సాక్ష్యం.
కార్డుల జారీలో కపట నాటకం!
జిల్లాలో 30 వేలకు పైగా కౌలు రైతులు వ్యవసాయం చేస్తుంటే, ప్రభుత్వ లెక్కలు మాత్రం వారిని వెక్కిరిస్తున్నాయి. కేవలం 11 వేల మందికి మాత్రమే కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్సీ) ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం వెనుక ఉన్న కుట్ర ఏమిటో అర్థం కావడం లేదని రైతులోకం ప్రశ్నిస్తోంది. క్షేత్ర స్థాయి వాస్తవాలను గాలికి వదిలేసి, ఏసీ గదుల్లో కాగితాలపై లక్ష్యాలు నిర్దేశించి చేతులు దులుపుకునే ధోరణిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు కేవలం 9,345 మందికే కార్డులు జారీ చేశామని అధికారులు గొప్పగా చెబుతున్నప్పటికీ, ఆ ప్రక్రియలో జరుగుతున్న భాగోతం అంతా ఇంతా కాదు. అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న వారికే కార్డుల పందేరం జరుగుతోందని, అసలైన కష్టజీవులకు అన్యాయం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. పైగా, జారీ చేసిన కార్డులలో సైతం అక్షర దోషాలు, తప్పుడు వివరాలతో అవి పనికిరాని కాగితపు ముక్కలుగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నెలాఖరుకు ప్రక్రియ పూర్తి చేస్తామని చెబుతున్న మాటలు నీటి మీద రాతలనే తలపిస్తున్నాయి.
పంట చేతికొచ్చాక పెట్టుబడా..?
రైతన్నను దగా చేసేందుకే ఈ ఎత్తుగడ...!
సాగుకు అత్యంత కీలకమైన పెట్టుబడి కోసం రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సమయంలో ఆదుకోవాల్సింది పోయి, పంట కోతకు వచ్చాక సాయం అందిస్తామనడం కౌలు రైతులను దగా చేయడానికేనని రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి. కౌలు కార్డుల జారీ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ, దానిని సాకుగా చూపి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టేందుకే కూటమి ప్రభుత్వం ఈ పన్నాగం పన్నిందని స్పష్టమవుతోంది. నవంబర్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని చెబుతున్నా, అప్పటికై నా ఈ అన్నదాతల ఆకలి కేకలు ప్రభుత్వ చెవికి ఎక్కుతాయో లేదో వేచి చూడాలి. తక్షణమే ప్రభుత్వం కళ్లు తెరిచి, అర్హులైన ప్రతి కౌలు రైతుకూ గుర్తింపు కార్డులు అందించి, అన్నదాత సుఖీభవ సాయాన్ని తక్షణమే విడుదల చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో, రైతుల ఆగ్రహ జ్వాలలకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాయి.
కౌలు రైతులకు ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తుంది. కౌలు రైతుకు సీఆర్సీ కార్డులు చట్ట ప్రకారం ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు మూడో వంతు కూడా ఇవ్వలేదు. గుర్తింపు కార్డు లేనిదే కౌలుదారుకు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ పథకం అమలు కాలేదు. గుర్తింపు కార్డు లేక కౌలుదారుకు సబ్సిడీ ఎరువులు కూడా ఇవ్వలేదు. మొన్న వర్షానికి, గాలికి పంట నష్టపోయినా కౌలుదారికి నష్టపరిహారం ఇవ్వడం లేదు. ప్రభుత్వం సేకరించే పంటలకు ఈ క్రాప్ చేయాలి. గుర్తింపు కార్డు లేనందున కౌలుదారు పేరున ఈ క్రాప్ చేయడం లేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం కౌలుదారులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి, ఈ క్రాప్ చేసి పంట రుణాలు, నష్టపరిహారం ఇవ్వాలి.
– ఎం.కృష్ణమూర్తి,
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
జిల్లాలో 30 వేల మంది కౌలు రైతులు
11 వేల మందికే గుర్తింపు కార్డులు
70 శాతం సాగు వారిదే అయినా.. సాయంలో సున్నా..
చెమటోడ్చే కౌలు రైతుకు కూటమి సర్కార్ మొండి చేయి
పెట్టుబడి సాయం ఎగ్గొట్టేందుకే కౌలు కార్డుల జారీలో జాప్యం

కూటమి కపట నాటకం!

కూటమి కపట నాటకం!