శిథిలావస్థలో కుష్ఠు ఆస్పత్రి | - | Sakshi
Sakshi News home page

శిథిలావస్థలో కుష్ఠు ఆస్పత్రి

May 30 2025 1:38 AM | Updated on May 30 2025 1:38 AM

శిథిలావస్థలో కుష్ఠు ఆస్పత్రి

శిథిలావస్థలో కుష్ఠు ఆస్పత్రి

భయాందోళనలో రోగులు

వసతిలేక ఇబ్బందులు

రాజాం: ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చాలామందికి పొగిరి లెప్రసీ ఆస్పత్రి పేరు తెలిసే ఉంటుంది. విశాఖపట్నం పరిధిలో కేవలం మూడుచోట్ల మాత్రమే స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లెప్రసీ నిర్మూలన ఆస్పత్రులు ఉండేవి. అందులో పొగిరిలో ఒకటి నిర్మించి, సేవలు ప్రారంభించారు. 1962లో ఎంతో అట్టహాసంగా నాలుగు భవనాలతో లెప్రసీ ఆస్పత్రి ఇక్కడ ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకూ అవే భవనాల్లో ఇక్కడ రోగులకు సేవలు అందిస్తున్నారు. స్థలాలు, నిధులు ఉన్నా పక్కా భవనాల నిర్మాణం ఇక్కడ లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం దు.

పట్టించుకునేవారేరీ?

రాష్ట్రప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టిసారించడం లేదు. కుష్ఠు నిర్మూలన కార్యక్రమాల ప్రారంభం అట్టహాసమే తప్ప వచ్చి తమ రోగాన్ని నిర్మూలించుకోవాలనుకునేవారికి కనీస వసతులు కల్పించలేకపోతున్నారు. రాజాంతో పాటు రేగిడి, వంగర, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు, తెర్లాం తదితర ప్రాంతాల్లోని రోగులకు పొగిరి లెప్రసీ ఆస్పత్రి ఆసరాగా ఉంటుంది. ప్రతి నెలా సగటున 20 నుంచి 28 మంది రోగులు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వ్యాధి తగ్గినవారు ఇంటికి వెళ్లిపోతుండగా, కొత్తవారు వచ్చి నయం చేసుకుంటున్నారు. వారికి కనీసం ఇక్కడ భోజనం పెట్టే సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించలేదు. రాజాంకు చెందిన పారిశ్రామికవేత్త జీఎంఆర్‌ ఆర్థిక సాయంతో పాటు కొంతమంది దాతలు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఆర్థికసాయాన్ని అందిస్తున్నారు. తాగునీటి సమస్యతో పాటు వసతి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, కనీసం దుప్పట్లు, రగ్గులు వంటివి కూడా ఇక్కడ పంపిణీ లేదని పలువురు బాధితులు వాపోతున్నారు.

భోజన సదుపాయం లేదు

మేం చిన్నచిన్న కుష్ఠు వ్యాధి లక్షణాలతో ఇక్కడ చేరాం. ప్రస్తుతం వ్యాధి తగ్గుముఖం పడుతోంది. ఇంటి వద్ద కుటుంబసభ్యులు వచ్చేయమన్నారు. కానీ మరికొద్ది రోజులు ఉండి వెళ్లాలని అనుకుంటున్నాను. ఇక్కడ సరైన భవనాలు లేవు. దోమలు. విష సర్పాల బెడద ఉంటుంది. భోజనాలు దాతలు సమకూర్చు తున్నారు.

కె.రాంబాబు, కుష్ఠువ్యాధి బాధితుడు

కొత్త వాటి పంపిణీలేదు

ఇక్కడ ఆస్పత్రిలో ఎప్పటివో పాతకాలంనాటి దుప్పట్లు, బెడ్‌షీట్లు ఉన్నాయి. సరైన వస్తుసామగ్రి లేదు. కొత్తవి పంపిణీ చేయడంలేదు. దాతలు ఇచ్చిన రగ్గులు, దుప్పట్లు తప్ప కొత్తవి ప్రభుత్వం నుంచి సరఫరాలేదు.

పి.లక్ష్మణరావు, కుష్ఠువ్యాధి బాధితుడు

చినుకుపడితే చిత్తడే

ఎప్పుడో 62 సంవత్సరాల క్రితం నిర్మించిన రేకులు, పెంకుల భవనాలే ఇప్పటికీ ఆస్పత్రి భవనాలుగా ఉన్నాయి. వాటి రేకులు శిథిలమై నీరు కారుతోంది. ఎండాకాలంలో నేరుగా ఎండ లోపలకు వచ్చేస్తుంది. విషసర్పాలు, దోమలు నేరుగా భవనాల్లోకి వస్తున్నాయి. చలికాలం, వర్షాకాలంలో ఇక్కడ రక్షణలేని పరిస్థితి కనిపిస్తోంది. కిటికీల తలుపులు, ప్రధాన ద్వారబంధాల తలుపులు మొత్తం ఊడిపోయాయి. వాటికి స్థానిక వైద్యులు సొంత డబ్బులతో మరమ్మతులు జరిపిస్తున్నారు. రాజాంకు చెందిన జీఎంఆర్‌ వీఎఫ్‌ చిన్నచిన్న మరమ్మతులకు ఆర్థికసాయం అందిస్తోంది. కొత్తగా ఇక్కడ భవనాలు అవసరమున్నప్పటికీ రోగుల సంఖ్య తగ్గడంతో పెద్దగా దృష్టిసారించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement