
69 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
● రూ.6.90 లక్షల జరిమానా వసూలు
విజయనగరం క్రైమ్: విజయనగరం పోలీసులు గురువారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో రూ.6.90 లక్షల జరిమానా వసూలు చేశారు. మొత్తం 69 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో బాధ్యులను కోర్టులో ప్రవేశపెట్టారు. మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానాను విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ చక్రవర్తి విధించారని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. అలాగే వాహనాలను ఢీ కొట్టి పలు ప్రమాదాలకు కారకులవుతున్నారన్నారు. ఈ తరహా బైక్ రైడ్స్ను కట్టడి చేసి, ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేకించి విజువల్ పోలీసింగ్ చేపడుతున్నామన్నారు. విజువల్ పోలీసింగ్లో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తమ సిబ్బంది చేపడుతున్నారని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.
రైలు కింద పడి ఒడిశా వాసి మృతి
దత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురం రైల్వేగేట్ సమీపంలో రైలు కింద పడి గురువారం ఉదయం ఒడిశా వాసి మృతి చెందినట్లు బొబ్బిలి రైల్వే కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపారు. ఒడిశాలోని కలహండి జిల్లా జమున్ బహల్ తాలూకా, దాదాపూర్ గ్రామానికి చెందిన జవహర్లాల్ బిశ్వాల్(45)ను వైజాగ్ నుంచి బొబ్బలి వైపు వెళ్తున్న రైలు ఢీకొనడంతో మృతి చెందినట్లు చెప్పారు. దీనిపై మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని విజయనగరం సర్వజన ఆస్పత్రిలో ఉంచినట్లు తెలిపారు.