
గ్రంథాలయాలతోనే బాలల వికాసం
విజయనగరం: గ్రంథాలయాలు బాలల వికాసానికి తోడ్పడతాయని విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.లక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ ప్రతి పంచాయతీ స్థాయిలోనూ విద్యార్థులకు అందుబాటులో గ్రంథాలయం ఉండాలన్నారు. పిల్లలను కూర్చోబెట్టి పైకి వినిపించేలా పుస్తక పఠనం చేయిస్తే భాషా ఉచ్చారణ, పఠన సామర్థ్యం కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని ఈ విషయంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా శ్రద్ద పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో అసక్తిగా పాల్గొని భారతదేశ చరిత్రతో పాటు, జిల్లాస్థాయి అంశాలపైన విద్యార్థులు ఎంతో హుషారుగా సమాధానాలు చెప్పారు. విజేతలకు పుస్తకాల ను, పతకాలను అందజేశారు. కార్యక్రమంలో మేకా అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకురాలు అనంతలక్ష్మి, ఏపీ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ కార్యదర్శి సుభద్రా దేవి, మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, సంఘం సలహాదారు కంచర్ల రాజేశ్వరరావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.