
భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి
పార్వతీపురంటౌన్: అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు. జిల్లా, మండల అధికారులతో బుధవారం ఉదయం టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అత్యవసర వేళ ఆదుకునేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్:08963 293046ను ఏర్పాటు చేశామన్నారు. పార్వతీపురం, పాలకొండ రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. తహసీల్దార్లు, వీఆర్వోలు, సిబ్బంది ప్రధాన కేంద్రాల్లో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నదులు, వాగులు, వంకలు, చెరువులను ఎవరూ దాటకుండా, దిగకుండా సూచనలు చేయాలని తెలిపారు. పంచాయతీరాజ్, ఇరిగేషన్ సిబ్బంది చెరువులు, అనకట్టలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. ప్రసవ సమయం దగ్గర పడిన గర్భిణులను వసతి గృహానికి, ఆస్పత్రులకు తరలించాలన్నారు.
అవగాహనే ప్రధానం
పార్వతీపురంటౌన్: ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ అధికారులను బుధవారం ఆదేశించారు. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాలు అమలుచేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం, సీతంపే ఐటీడీఏ పీఓలు అశుతోష్ శ్రీవాస్తవ, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, కెఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి పాల్గొన్నారు.