
అమ్మో..జూన్..!
అమ్మా..నాన్నా..కొత్త బ్యాగు, కొత్త పుస్తకాలు..కొత్త యూనిఫాం..కొత్త షూస్ కావాలని పిల్లలు ఇంట్లో అడుగుతుంటే ఆ తల్లిదండ్రుల గుండెలు బరువెక్కుతున్నాయి. ఆకాశం వైపు.. పొలంవైపు చూస్తూ..ఈ ఏడాది వరిపంట వేయాలి. సాగుకు పెట్టుబడి సాయం కోసం ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన మదిలో మెదలగానే అన్నదాతల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఏటా జూన్ నెల వచ్చిందంటే చాలు. పిల్లల తల్లిదండ్రులు..అన్నదాతలు..కంటికీ కనిపించని శత్రువుతో మానసిక యుద్ధం చేయాల్సిందే.
పార్వతీపురం:
జూన్ మాసం వచ్చిందంటే మధ్యతరగతి కుటుంబాలు, రైతుల్లో ఆందోళన నెలకొంటుంది. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం..రైతులకు పంటల సాగులో పెట్టుబడుల భారం తప్పడం లేదు. పిల్లలకు ఫీజులు, వసతి ఖర్చులు, తలుచుకుని తల్లిదండ్రులు జూన్ నెల వచ్చేసిందంటూ ఆందోళన చెందడం పరిపాటిగా మారింది. పాఠశాలల ప్రారంభానికి మునుపే ప్రైవేట్ పాఠశాల సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులను గాలించారు. ప్రాథమిక పాఠశాల విద్య పూర్తయిన వారిని ఉన్నత పాఠశాలకు, ఉన్నత విద్య పూర్తయిన వారిని తమ కళాశాలలో చేర్పించాలంటూ ఒకటికి రెండుసార్లు ఒత్తిడి తెచ్చి ఆయా పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించుకున్నారు. గరుగుబిల్లి, కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల నుంచి పలువురు విద్యార్థులను సమీపంలోని పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు మక్కువ చూపుతున్నారు. రోజూ పదుల సంఖ్యలో పాఠశాలకు చెందిన బస్సులు విద్యార్థులను తీసుకువెళ్లేందుకు గ్రామాలకు వస్తున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం రైతులు ఖరీఫ్లో సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పంట పెట్టుబడికి రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇటు వ్యవసాయ మదుపులు, అటు కళాశాల, పాఠశాలల ఫీజుల భారంతో సగటు మనిషి ఆర్ధిక ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా గత ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టుబడి సాయంకింద ఏటా రూ.14వేలు అందించి రైతులను ఆదుకోవడంతోపాటు అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15వేలు అదించించి తల్లిదండ్రులకు భారాన్ని తగ్గించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి సాయంకానీ, చదువుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని కానీ అందించలేదు. ఈ కారణంగా రైతులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సాగుకు భారం
జిల్లాలోని పదిహేను మండలాల్లో 1.77 లక్షల ఎకరాల్లో 52, 500 మంది రైతులు ఖరీఫ్లో వరిపంటను సాగుచేస్తున్నారు. ఎకరా వరి పంటను సాగుచేయాలంటే రూ.15వేల నుంచి రూ. 20వేలవరకు మదుపు అవుతుంది. ప్రస్తుతం ఆయాగ్రామాల్లో పదుల సంఖ్యలో రైతులు కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలను సాగుచేసి కుటుంబ పోషణ చేస్తున్నారు. రైతులు ఖరీఫ్కు తమ పంట పొలాలను సాగుకు సిద్ధం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వరిపంటను సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. చేతిలో నగదు లేకపోయినా అప్పులు చేసైనా పంటలు పండించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు కురవడంతో ఖరీప్ పనులపై ఆశ రైతుల్లో పెరుగుతోంది.
తల్లిదండ్రులకు ఫీజుల భారం
రైతులకు పంట సాగు పెట్టుబడి ఆందోళన
ఫీజుల మోత..
ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫీజులు, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, యూనిఫాం, బ్యాగుల కొనుగోలుకు వారి నెలవారీ బడ్జెట్ సరిపోవడం లేదు. ఫీజులు, బస్సు రవాణా, పుస్తకాల భారం తడిసి మోపెడవుతోంది. ప్రాథమిక పాఠశాల స్థాయికి రూ.15వేల నుంచి రూ.40వేల వరకు, ఉన్నత పాఠశాల స్థాయికి రూ. 25వేల నుంచి రూ.60వేల వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఇంటర్మీడియట్కు కార్పొరేట్ కళాశాలల్లో రూ.80 వేల నుంచి రూ.2.50లక్షల వరకు ఖర్చవుతుంది. విద్య ఖర్చులు, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా ఉన్నాయి. అయినా పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని అప్పు చేసైనా చదివించేందుకే తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం పర్యవేక్షణ కొరవడడం, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల చెల్లింపులను నిఘాపరిధిలో చేర్చకపోవడంతో వారి ఇష్టారాజ్యంగా మారింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను క్రమబద్ధీకరించడం, ఫీజుల వసూళ్లపై నిఘా వేయడం, ఇన్కంటాక్స్ దాడులను చేస్తే కొంతవరకై నా ఫీజులమోత తగ్గే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.