ఒక్క సిలిండర్‌తో సరి..! | - | Sakshi
Sakshi News home page

ఒక్క సిలిండర్‌తో సరి..!

May 9 2025 12:53 AM | Updated on May 9 2025 12:53 AM

ఒక్క సిలిండర్‌తో సరి..!

ఒక్క సిలిండర్‌తో సరి..!

విజయనగరం ఫోర్ట్‌: అధికారం కోసం కూటమి సర్కార్‌ అనేక హామీలను ప్రజలకు ఇచ్చింది. అలవికాని హామీలు అయినప్పటికీ ప్రజలను బాగా నమ్మించింది. అందులో మహిళలను ప్రభావితం చేసింది ఉచిత గ్యాస్‌ పథకం. ప్రతి ఏడాదీ మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఊరూరా గొప్పగా ప్రచారం చేశారు. కానీ ఇప్పడు పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. 2024–25లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో చెప్పిన విధంగా 2024–25 సంవత్సరంలోనే మూడు సిలిండర్లు ఇవ్వాలి. కానీ 2024–25 మార్చి నెల లోపు ఒక సిలిండర్‌ మాత్రమే ఇచ్చి సరిపెట్టేశారు. అంటే ఒక ఏడాదిలో ఇవ్వాల్సిన మూడు సిలిండర్లకు గాను రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టారనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. ఇది కోట్లాది రుపాయల భారం తగ్గించుకునే ఎత్తుగడ అనే విమర్శలు సర్వత్రా వినినిస్తున్నాయి.

గుర్తించిన లబ్ధిదారులు 5.02 లక్షలమంది

జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్లు 7 లక్షలకు పైగా ఉన్నాయి. ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్‌కోసం గుర్తించిన లబ్ధిదారులు 5,02,654 మంది. ఇందులో 2024–25 సంవత్సరానికి సంబంధించి 4,46,846 మంది గ్యాస్‌ సిలిండర్‌ కోసం బుక్‌ చేసుకున్నారు. 55,808 మంది గ్యాస్‌ బుక్‌ చేసుకోలేదు.

జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్ల వివరాలు:

జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్లు 7,04,273 ఉన్నాయి. అందులో జనరల్‌ గ్యాస్‌ కనెక్షన్లు 3,46,455. అదేవిధంగా ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్‌లు 1,29,277, సీఎస్‌ఆర్‌ కనెక్షన్లు 34,287 ఉన్నాయి. దీపం కనెక్షన్లు 1,85,254 ఉన్నాయి.

ఉచిత గ్యాస్‌పై కొత్త భాష్యం

ఉచిత గ్యాస్‌పై ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోంది. ఏడాదికి మూడు సిలిండర్లపై ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు పొంతన లేకుండా ఉంటున్నాయి. 2024–25 లో ఇవ్వాల్సిన మూడు సిలిండర్లకు ఆ ఏడాదిలో ఒక్క సిలిండర్‌ మాత్రమే ఇచ్చారు. కానీ నవంబర్‌ 2024 నుంచి నవంబర్‌ 2025 లోగా మూడు సిలిండర్లు ఇస్తామని కూటమి సర్కార్‌ చెబుతుంది. ఇలా అయితే 2024వ సంవత్సరానికి సంబంధించి రెండు సిలిండర్లు ఎగనామం పెట్టినట్లేననే లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.

లబ్ధిదారుల్లో కోత

వివిధ కారణాలతో కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్‌ రాయితీని తగ్గించుకోవాలనే చూస్తోందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌ బిల్లు ఎక్కువగా వచ్చిందని కొందరికి, ఇంట్లో అంగన్‌వాడీ కార్యకర్త, ఆశ కార్యకర్త వంటి చిరుద్యోగులు ఉన్నారని మరి కొందరికి ఇలా అనేక కారణాలతో లబ్ధిదారులకు అందించాల్సిన ఉచిత రాయితీని ప్రభుత్వం ఎగ్గొంటేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏడాదికి మూడు ఇస్తామని ఎన్నికల్లో హామీ

జిల్లాలో ఉచిత గ్యాస్‌ లబ్ధిదారులు 5,02,654 మంది

మొదటి విడత వినియోగించుకున్న వారు 4,43,334 మంది

మూడు సిలిండర్లుగా పరిగణన

2024–25 నవంబర్‌ నుంచి 2025–26 నవంబర్‌ నాటికి మూడు సిలిండర్లుగా పరిగణిస్తున్నాం. 2024–25 నవంబర్‌ నుంచి మార్చి 2025 నాటికి ఒక సిలిండర్‌ అందజేశాం.

కె.మధుసూదన రావు,జిల్లా పౌరసరఫరాల అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement